చంద్రబాబు తన 40ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడు చేయనంత కసరత్తు చేసి ప్రకటిస్తున్నానని చెప్పి మరీ ప్రకటించిన టీడీపీ అభ్యర్ధుల జాబితా చివరికి ఆయనకే తల పోటుగా మారుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అర్ధమవుతుంది. అటు ఉత్తరాంద్ర నుండి ఇటూ రాయలసీమ వరకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో నిరసన జ్వాలలు ఎగిసి పడుతున్నాయి.
మరీ ముఖ్యంగా పి.గన్నవరంలో మహాసేన యూట్యూబ్ చానల్ ఓనర్ గా చెప్పుకునే రాజేష్ కి సీటు కేటాయించడాన్ని అటూ జనసేనతో పాటు ఇటూ టీడీపీ వారూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అభ్యర్ధిని మార్చాలని చెబుతూ నిరసనగా టీడీపీ కార్యాలయానికి తాళం వేసి మరీ అధిస్టానానికి అల్టిమేటం జారీ చేసినా ఎలాంటి స్పందన వారి నుంచి లేకపోవడంతో ఇప్పుడు నియోజక వర్గంలోని టీడీపీ కార్యకర్తలు , నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
తాజాగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎన్నికల బరిలో నిలబడి 45,166 ఓట్లు సాధించిన నేలపూడి స్టాలిన్ బాబు కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో మహాసేన రాజేష్ కి టికెట్ కేటాయించడం టీడీపీని కోలుకోలేని దెబ్బతీసిందని పీ గన్నవరంలోని టీడీపీ నేతలు వాపోతున్నారు.