ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ నుండి పలువురు నేతలు పెద్ద ఎత్తున చేరుతున్నారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా బస్సు యాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా సీఎం జగన్ సమక్షంలో పెద్ద ఎత్తున ఇతర పార్టీల నాయకులు వైసీపీలో చేరారు.
వివరాల్లోకి వెళితే చీకటిమునిపల్లె స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆప్నా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏ వీ సుబ్బారెడ్డి చేరారు. వారిని వైసీపీ కండువా కప్పి సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. అదే క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మదనపల్లె టీడీపీ మైనార్టీ నేత మొబసిర్ అహ్మద్ చేరారు. సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి మొబసిర్ అహ్మద్ ను పార్టీలోకి ఆహ్వానించారు. కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఎం గంగాధర్ చీకటిమునిపల్లె స్టే పాయింట్ వద్ద వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి ఎం గంగాధర్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
కాగా త్వరలో ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తుండగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగనుంది. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని సీఎం జగన్ నమ్ముతుండగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమను గెలిపిస్తుందని కూటమి విశ్వసిస్తుంది.