‘నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చాలా పెద్ద రౌడీ. కమలహాసన్ కూడా ఆయనలా నటించలేడు. అవినీతిపరుడు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఘనుడు. వ్యాపారులు, రైస్మిల్లుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నాడు. బెదిరిస్తూ భూ సెటిల్మెంట్లు చేస్తున్నాడు. జనాన్ని, కాంట్రాక్టర్లను, ప్రభుత్వ అధికారులను వేధిస్తున్నాడు. మా వాళ్లపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.’ మొన్నటి వరకు తెలుగుదేశం సీనియర్ నేతల మాటలివి. శ్రీధర్రెడ్డి పార్టీ మారగానే వారికి గొప్ప వ్యక్తి అయిపోయాడు. చంద్రబాబు నాయుడు శనివారం నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో జగన్ను ఎదరించాడంటూ ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు.
‘శ్రీధర్రెడ్డి.. సర్ మీరు చేసే పనులు కరెక్ట్ కాదని జగన్కు చెప్పాడు. దీంతో ఆయన్ను వేధించి వేధించి వెంటాడాడు. భయపడకుండా నువ్వు ఏం చేస్తావో చెయ్యి’ అంటూ బలంగా తయారై సవాలుగా ముందుకు పోయారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలను బట్టి టీడీపీ వెంట ఉంటే మంచి వారు.. వేరే పార్టీలో ఉంటే చెడ్డవారని చెప్పకనే చెప్పినట్లు అయ్యింది.
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యాన రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. తనకు వందల కోట్ల రూపాయలు ఆస్తులు లేవని, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదని, జగన్ వల్ల ప్రజాప్రతినిధి అయ్యాయని చాలా సభల్లో చెప్పారు. తాను చనిపోతే జగనన్న వచ్చి వైఎస్సార్సీపీ జెండా కప్పాలని ఒకానొక సందర్భంలో బహిరంగసభలో అన్నారు. వైఎస్ కుటుంబమే తన కుటుంబమని వెల్లడించారు. మంత్రి వర్గంలో స్థానం కల్పించలేదని ఏడ్చి గగ్గోలు పెట్టారు. అప్పుడు కూడా తన రాజకీయ జీవితం జగన్తోనే అని, ఆయన కోసం ప్రాణం ఇస్తానని చెప్పారు. అలాంటి వ్యక్తి టీడీపీలో చేరడం వెనుక అనేక కారణాలున్నాయి.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక శ్రీధర్రెడ్డి తన తమ్ముడు గిరిధర్రెడ్డిని ముందు పెట్టి రౌడీ రాజకీయాలకు తెరతీశారు. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడ్డారు. ఈ విషయం సీఎం జగన్కు తెలిసి పిలిపించుకుని మందలించినా తీరు మార్చుకోలేదు. చాలాసార్లు టీడీపీ నేతలు ఆయనపై ప్రెస్మీట్లు పెట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీధర్రెడ్డి మారడం లేదని తెలుసుకున్న జగన్ వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో వెంటనే చంద్రబాబుకు టచ్లోకి వెళ్లారు. టికెట్ ఇచ్చి, అధికారంలోకి వస్తే మంత్రిని చేస్తానని హామీ ఇస్తే పార్టీ మారుతానని చెప్పారు. బాబు ఓకే చెప్పడంతో ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని డ్రామా ఆడారు. కోటంరెడ్డి రాకను తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. బహిరంగంగా అధినేత నిర్ణయాన్ని తప్పుపట్టారు. అయినా నారా వారు ఇన్చార్జిగా ఉన్న ముస్లిం వర్గానికి చెందిన అబ్దుల్ అజీజ్కు వెన్నుపోటు పొడిచారు. టీడీపీ డబ్బుకు అమ్ముడుపోయిన కోటంరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ లైన్ దాటడంతో వైఎస్సార్సీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఇక కోటంరెడ్డి సోదరులు తెలుగుదేశంలో చేరిపోయారు. రూరల్ టికెట్ కన్ఫార్మ్ చేయించుకున్నారు.
చంద్రబాబు పక్కా స్వార్థపరుడని కోటంరెడ్డి విషయంలో మరోసారి రుజువైంది. ఒకప్పుడు తిట్టిన నోటితోనే ఇప్పుడు ఆయన్ను ఆకాశానికి ఎత్తాల్సి వచ్చింది. అయితే ఇందులో మర్మం దాగుంది. అదే పొగడ్తల పేరుతో జగన్ను తిట్టడం. కోటంరెడ్డి మీద ప్రేమ పొంగింది అనుకుంటే పొరపాటే. తనను పొగిడారని ఈ ఎమ్మెల్యే సంబరపడినా నిజాలేంటో ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికే శ్రీధర్రెడ్డిపై రూరల్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన మరోసారి వస్తే రౌడీయిజం చేస్తారని భయం ఉంది. బాబు ఎన్ని మాటలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు.
ఒకరకంగా చెప్పాలంటే ఇద్దరూ మోసగాళ్లే. తమ స్వార్థం కోసం ఏమైనా చేస్తారు. ఏ మాటలైనా చెబుతారు. శ్రీధర్రెడ్డి రౌడీ అని బాబుకు బాగా తెలుసు. టీడీపీ అధినేతను నమ్మితే నిండా ముంచేస్తాడని శ్రీధర్రెడ్డికి ఐడియా ఉంది. కాకపోతే ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఇద్దరూ ఏవో కాకమ్మ కబుర్లు చెబుతున్నారంతే..