ఒక్క తప్పటడుగుతో జంగా కృష్ణమూర్తి రాజకీయ జీవితం ప్రశ్నార్థకమైపోయింది. ఏదో చేస్తాడని చంద్రబాబు నాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయుల్ని నమ్ముకున్నందుకు ఇంత కాలం సంపాదించుకున్న మంచిపేరు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. 2014 నుంచీ అండదండగా ఉన్న వైసిపిని కాదని గురజాల టికెట్ కోసం టీడీపీ వైపు వెళ్లే ప్రయత్నం చేసిన జంగా లావుతో పాటు టీడీపీ కండువా కప్పుకోవాల్సిందే కానీ టికెట్ ఇస్తామన్న చంద్రబాబు మాట నమ్మలేక కండువా కప్పుకోకుండా ఆగిపోయారు.
చివరికి గురజాల టీడీపీ టికెట్ యరపతినేనికే ఖరారు చేయడంతో జంగా అయోమయంలో పడిపోయారు. తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్లోకి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు కృష్ణమూర్తి. పార్టీ పెద్దలతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. ఈ సమయంలోనే లావు ఎంట్రీ ఇచ్చాడు. టికెట్ ఇప్పించలేకపోయినా మరో విధంగా లబ్ధి చేకూరుస్తానని ప్రలోభ పెడుతున్నాడు.
నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పి.అనిల్ కుమార్ ను నిలబెట్టారు ఏపీ సీఎం జగన్, ఈయనకు రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ ఉంది. అనిల్ ఢీకొట్టే సత్తా లావు లేకపోవడంతో బీసీలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డాడు. బీసీ అయిన జంగా ఇప్పుడు వైఎస్సార్సీపీలోకి తిరిగి వెళ్లిపోతే తను నష్టపోవాల్సి వస్తుందని ఈ టీడీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి ఆందోళన చెందుతున్నారు. బీసీల్లో వ్యతిరేకత వస్తుందని భయపడి రెండు రోజులుగా కృష్ణమూర్తిని కలిసి బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే తిరుమల, తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇప్పిస్తానని, ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తానని పలు హామీలు ఇచ్చారని సమాచారం . మంగళవారం అర్ధరాత్రి కూడా జంగాతో మాట్లాడేందుకు లావు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన వైఎస్సార్సీపీలో తిరిగి చేరడం సస్పెన్స్గా మారింది. కృష్ణమూర్తి ప్రలోభాలకు లొంగిపోయి ఆ గట్టుకు వెళ్తాడా.. లేక జగన్ను నమ్ముకుని రాజకీయ భవిష్యత్ కోసం ఈ గట్టుకు వస్తాడా.. అనేది హాట్ టాపిక్గా మారింది.