జనసేన పార్టీ నేత కుప్పాల మధు కర్ణాటకలోని బీదర్లో దారుణహత్యకు గురయ్యాడు. స్నేహితులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. క్యాసినో కింగ్ గా పేరొందిన మధు హత్యకు డబ్బు లావాదేవీలే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన పార్టీలో క్రీయాశీలకంగా ఉండే మధు మరణం క్యాసినోతో పాటు బిల్డర్ గా, ట్రావెల్స్ యజమానిగా అనేక వ్యాపారాలు చేసేవాడని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే ఏపీ కోనసీమ జిల్లాలోని అమలాపురానికి చెందిన మధు 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ కి వచ్చి కుత్బుల్లాపూర్ చింతల్ గణేశ్నగర్ ప్రాంతంలో మణికంఠ ట్రావెల్స్ పేరుతో కార్లు అద్దెకిచ్చే బిజినెస్ పెట్టుకుని జీవనం ప్రారంభించి, ఆ తరువాత బిల్డర్ గా కూడా మారినట్టు తెలుస్తుంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
మధుకి క్యాసినో కింగ్ అనే పేరు కూడా ఉంది. క్యాసినోలో ఆయనది అందెవేసిన చేయిగ చెబుతుంటారు. క్రమేపీ క్యాసినో ఏజెంట్గా మారిన మధు గోవా, మలేసియా, బెంగళూర్, కర్ణాటక, సింగపూర్, దుబాయ్కి వెళ్లి క్యాసినోలో పాల్గొనేవాడని తెలుస్తుంది. జనసేన నాయకుడిగా, క్యాసినో కింగ్ గా, ట్రావెల్స్ యజమానిగా , బిల్డర్ గా అనేక వ్యాపకాలు ఉన్న మధు బీదర్ లో హత్య కావడం వెనుక ఏ కోణం ఉందో పోలీసులు చేధించే పనిలో ఉన్నారు. ఈనెల 24న ఉదయం కల్పన సొసైటీకి చెందిన తన స్నేహితులు రేణుకా ప్రసాద్, నిఖిత్, గోపీతో కలిసి కారులో బయటకు వెళ్ళిన మధు, కాసేపటికి భార్యకు ఫోన్చేసి తాను పనిమీద స్నేహితులతో కలిసి బీదర్ పోతున్నానని చెప్పాడు. ఆ తరువాత హత్యకు గురైనట్టు చెబుతున్నారు. అయితే మధూ స్నేహితులు సైతం అప్పటి నుండి కనిపించడంలేదని తెలుస్తుంది. ఈ మిస్టరీనీ పోలీసులు చేధించే పనిలో ఉన్నారు. జనసేన పార్టీ ముఖ్యనాయకుడిగా ఉన్న మధు ఇటీవల ఏపీలోని పిఠాపురంలో పవన్కు మద్దతుగా ప్రచారం నిర్వహించాడు.