మీరు మళ్లీ ఒక్కటైపోతున్నారు. మమ్మల్ని ఆటలో అరటిపండు చేస్తున్నారని ఏపీ బీజేపీ, తెలుగుదేశం పెద్దల్ని చూసి జనసేన నేతలు తెగ ఫీలైపోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం కమలం పెద్దల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం జరిగిన భేటీలో అమిత్షా, జేపీ నడ్డా ఆరు నుంచి ఎనిమిది ఎంపీ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేశారని, దీనికి ఆయన ఓకే చెప్పినట్లు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి బాబు, బీజేపీల మధ్య బంధం ఇప్పటిది కాదు. గతంలో పలుమార్లు కలిశారు. విడిపోయారు. అది నారా వారి వల్లే.. కానీ 2014లో జనసేనను తీసుకొచ్చి బాబు కలిపాడంతే.. 2019 తర్వాత సేన కమలాన్ని అందుకుంది. నేడు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బాబు మళ్లీ బీజేపీ స్నేహం కోసం కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు ఆయన వారితో చేరితే రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. పురందేశ్వరి, సీనియర్ నాయకులు బాబుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. నిన్నటి వరకు కీలకంగా కనిపించిన పవన్ను పక్కకు నెట్టేస్తారు.
ఇదే జనసైనికుల భయం. తాము అడిగిన సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. జిల్లాల్లో నాయకులు టికెట్ అడుతుంటే టీడీపీ నాయకులు ప్రెస్మీట్లు పెట్టి వారిని తిడుతున్నారు. పవన్ కూడా టీడీపీని గట్టిగా అడగడం లేదు. ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి. ఈ విషయాలపై జనసేన కార్యకర్తలు ఇప్పటికే రగిలిపోతుండగా.. బీజేపీ అడిగిన సీట్లకు టీడీపీ అధినేత ఓకే చెప్పారన్న వార్త వారిని తీవ్రంగా బాధిస్తోంది. ఇప్పటికే సభల్లో తెలుగు తమ్ముళ్లు సేన కార్యకర్తలను చితక్కొడుతున్నారు. ఇక బీజేపీతో పొత్తు ఖారారైతే వాళ్లు కలిసిపోయి తమను మరింత చిన్నచూపు చూస్తారని ఆందోళన చెందుతున్నారు. దీనంతటికీ పవన్ కళ్యాణ్ తీరే కారణమని బయటకు చెప్పలేక.. పార్టీ భవిష్యత్ ఏంటో అర్థం గాక బ్రో ఇప్పుడు మా పరిస్థితి ఏందంటూ ఒకప్పుడు ప్రజారాజ్యంలో పనిచేసిన కార్యకర్తలను అడుగుతున్నారు. వాళ్లేమో నవ్వుకుంటున్నారు.