‘జగనన్న తోడు’.. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు, పుట్ఫాత్ అమ్మకాలు చేసేవారు, వీధి వ్యాపారులు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించుకునే వారు, ఆటోలు, సైకిళ్లపై అమ్ముకునే వారు తదితరులు తమ కాళ్లపై నిలబడి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఇది. గతంలో చిరు వ్యాపారులు అనేక ఇబ్బందులు పడేవారు. అధిక వడ్డీకి నగదు తెచ్చి తిరిగి కట్టలేకపోయేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రూ.10 వేలు, అంతకు పైన రూ.13 వేల వరకు వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నారు.
గురువారం 8వ విడత నిధులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 3,95,000 మంది చిరు వ్యాపారులకు రూ.417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు ఇచ్చారు. 5.81 లక్షల మందికి వడ్డీ రీయింబర్స్మెంట్ కింద రూ.13.64 కోట్లు అందించారు. ఇప్పటివరకు జగనన్న తోడు ద్వారా రూ.3,373 కోట్లు రుణాలు ఇచ్చారు. ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల రుణం సున్నా వడ్డీకే అందిస్తున్నారు. సకాలంలో చెల్లించినవారికి ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు ఇచ్చి అండగా నిలిచారు. ప్రభుత్వం ఆదుకోవడంతో చిరు వ్యాపారులు ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ, మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్నారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించడం వారికి కలిసొచ్చే అంశం. మొత్తంగా 16,73,580 మంది లబ్ధిదారులకు వడ్డీ చెల్లించారు. ఈ స్కీమ్ కింద 73,070 మంది చిరువ్యాపారులు ఇప్పటికే నాలుగుసార్లు డబ్బులు తీసుకొని చెల్లించారు. 5.10 లక్షల మంది మూడుసార్లు డబ్బులు తీసుకొని చెల్లించారు. మరో 3,98,226 మంది చిరువ్యాపారులు రెండుసార్లు రుణాలు పొందారు.
సీఎం మాటల్లో..
నగదు విడుదల సందర్భంగా జగన్ మాట్లాడారు. 87.13 శాతం అక్కచెల్లెమ్మలు లబ్ధి పొందారు. మహిళా సాధికారతలో మరో విప్లవం. 16.73 లక్షల మందిలో 79.14 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారు. ఇది కూడా సాధికారతలో మరో విప్లవం అని చెప్పవచ్చు. దేశానికే ఈ కార్యక్రమం దిక్సూచిగా నిలిచింది. కేంద్రంలో 58.63 లక్షల మందికి పీఎం స్వనిధి పేరుతో ఇస్తే.. మన రాష్ట్రంలోనే 16.74 లక్షల మంది ఉన్నారు. రూ.10,220 కోట్లు కేంద్రం ఇస్తే.. మన రాష్ట్రంలో రూ.3,337 కోట్లు ఇచ్చాం. మిగతా రాష్ట్రాలు ఎందుకు చేయలేకపోయాయో ప్రజలు ఆలోచించాలి, మన వద్ద ఉన్న సచివాలయ, వలంటీర్ వ్యవస్థతోనే ఇదంతా సాధ్యమైంది.