2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి మంచి భోజనం అందించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంది. కాగా మధ్యాహ్నం అందించే భోజనంలో ఇప్పటికే తగిన పోషక విలువలు గల ఆహారాన్ని అందిస్తున్నామని, దీనికి తోడుగా ఇంకా మంచి ప్రణాళికలు రూపొందించి వచ్చే ఏడాదికి మరింత పోషకాలు గల ఆహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. జగనన్న గోరుముద్ద ద్వారా ప్రభుత్వం ఇప్పటివరకు 43,26,782 మంది మంది విద్యార్థులకు 44 కోట్లను జగన్ ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆయన వెల్లడించారు.
శుక్రవారం కానూరులో శ్యామ్ రాక్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫుడ్ ఫీచర్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన జగనన్న గోరుముద్ద ఫుడ్ లిట్రసీ రాష్ట్రస్థాయి వర్క్ షాప్ కు ప్రవీణ్ ప్రకాష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాతీయ విద్యా విధానం ప్రకారం హెల్త్ అండ్ వెల్నెస్ ఎడ్యుకేషన్ ను కరిక్యులంలో భాగం చేయాల్సి ఉన్న తరుణంలో భాగంగా ఫుడ్ లిట్రసీని ఒక సబ్జెక్టుగా ఎలా చేర్చొచ్చు అనే అంశంపై ఫుడ్ ఫ్యూచర్ ఫౌండేషన్ తో ఒప్పందం జరిగిందని ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో పాఠ్యాంశాల్లో ఫుడ్ లిట్రసీని ఒక ప్రత్యేక అంశంగా చేర్చే అంశాన్ని అధ్యయనం చేసి ఫుడ్ ఫ్యూచర్ ఫౌండేషన్ ప్రభుత్వానికి నివేదికను అందిస్తుంది. ఈ సందర్భంగా ఫుడ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సీఈవో పవన్ అగర్వాల్ మాట్లాడుతూ ఫుడ్ లిట్రసీ అంశంపై ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ఫుడ్ లిట్రసీ సాధ్యాసాధ్యాలు, విద్యార్థులకు అవగాహన, ఉపాధ్యాయులకు శిక్షణ సమన్వయం వంటి తదితర అంశాలపై ఫుడ్ ఫ్యూచర్ ఫౌండేషన్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.