నిన్న ప్రొద్దుటూరులో జరిగిన మేమంతా సిద్ధం సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్ అధికారాన్ని పేదల భవిష్యత్ కోసం, రైతుల కోసం, అక్కచెల్లెమ్మల కోసం, అవ్వాతాతల కోసం, భావితరం పిల్లల కోసం, మన గ్రామాల కోసం, ఇంటింటి అభివృద్ధి కోసం, ఇంటింటి సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ కూడా విప్లవానికి మారు పేరుగా మార్పులు తీసుకురావడమే కాకుండా ఎక్కడా లంచాలు లేకుండా, వివక్షకు తావులేకుండా నేరుగా ప్రజల చేతిలో 2.70 లక్షల కోట్ల రూపాయలు ఉంచిన ప్రజా ప్రభుత్వ ఎజెండా… ఇక్కడ కనిపిస్తున్న మన జెండా అన్నారు.
ఈ జెండా మరే జెండాతోనూ కూడా జత కట్టడం లేదు. ప్రజలే ఎజెండాగా ఈ జెండా రెపరెపలాడుతోంది. ఈ ప్రొద్దుటూరు గడ్డ మీద ఇక్కడ ఉన్న నా లక్షల సింహాల గర్జన.. చరిత్రలో చిరస్థాయిగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ హర్షాన్ని వ్యక్తం చేశారు.
మీ అర్జునుడు సిద్ధంగా ఉన్నాడు.
మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా గర్జించండి. పేదలందరి ఇంటింటి అభివృద్ధికి అడ్డు పడుతున్న ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించే ఈ ఎన్నికల సమరంలో పాంచజన్యం పూరించడానికి శ్రీకృష్ణులైన మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను. మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు అని ఈ సందర్భంగా చెబుతున్నాను అంటూ కార్యకర్తలకి సారధ్యాన్ని అప్పగించే ప్రసంగం చేశారు.
మే 13న ఫ్యాను మీద రెండు ఓట్లు వేసి, మరో 100 మందికి చెప్పి వేయించి, మనందరి పార్టీని గెలిపించడానికి, అభివృద్ధి నిరోధకుల్ని, పేదల వ్యతిరేకుల్ని ఓడించడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను. మరో 48 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. గెలుపే లక్ష్యంగా మనందరం కూడా అడుగులు వేయాలి. మనకు పోటీగా ఉన్నది.. అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసాలు చెప్పేవాళ్లు. అవలీలగా కుట్రలు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్లందరూ ఏకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ చంద్రబాబు బృందానికి, ప్రజలకు అన్యాయం చేయడంలో, మోసాలు చేయడంలో, వెన్నుపోటు పొడవడంలో, నమ్మించి ప్రజల్ని నట్టేట ముంచడంలో, కుట్రలు, కుతంత్రాలు చేయడంలో ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడుకు 45 ఏళ్ల అనుభవం ఉందన్నారు
ఎన్నికలప్పుడు మాత్రమే బాబుకి మేనిఫెస్టో గుర్తుకొస్తుంది. రంగురంగుల కాగితాలు గుర్తుకొస్తాయి. ఎన్నికలు అయిపోతూనే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారు. ఈరకంగా 14 సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేస్తూ వస్తున్నారు అంటూ టీడీపీ మేనిఫెస్టో లక్ష్యంగా సూటి విమర్శలు చేశారు