‘ఎర్రబుక్కు చూపించి ఇందులో అందరి పేర్లు ఎక్కించా.. మా ప్రభుత్వం రాగానే అంతుచూస్తా’ కొంత కాలంగా సభల్లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి చేస్తున్న బెదిరింపులివి. అసలు ఆ బుక్కులో ఎక్కించాల్సింది తెలుగు తమ్ముళ్ల పేర్లే. వారు చేసే అరాచకాలు అలాంటివి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో చులకన చేసేందుకు టీడీపీ కార్యాలయం నుంచే కుట్రలకు తెరలేపారు. ఇదంతా లోకేశ్ కనుసన్నల్లోనే జరుగుతోంది. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలను జగన్ మనుషులు సోషల్ మీడియా వేదికగా తిడుతున్నారని ఆంధ్రజ్యోతి పెద్ద కథనం రాసింది. ఇదంతా భారతమ్మ డైరెక్షన్, సజ్జల స్క్రీన్ప్లేలో జరుగుతోందని ఆరోపించారు. తాడేపల్లి వేదికగా కొందరికి శిక్షణ ఇచ్చారని అబద్ధాలు రాశారు.
వాస్తవానికి లోకేశ్ ఆధ్వర్యంలో నడిచే ఐటీడీపీనే షర్మిలపై దుష్ప్రచారం చేస్తూ వైఎస్సార్సీపీపై అభాండాలు వేస్తోంది. కొద్దిరోజుల క్రితం కుట్రపూరితంగా షర్మిలపై పోస్టులు పెడుతూ జగన్ కార్యకర్తలపై బురద చల్లేందుకు ఎల్లో గ్యాంగ్ చేసిన యత్నాలు వెలుగులోకి వచ్చాయి. జనవరి 26వ తేదీ నుంచి తన పేరుతో కొందరు ఫేక్ ఐడీ సృష్టించి షర్మిల, సునీతపై చాలా దారుణంగా పోస్టులు పెడుతున్నట్లు గుర్తించిన పులివెందుకు చెందిన కార్యకర్త ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యంగా దూషిస్తున్న ఫేక్ ఐడీలను ట్రేస్ చేయాలని కోరారు. ఇదే విషయంపై జనవరి 31న వైఎస్సార్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్కు కూడా ఫిర్యాదు చేశారు. కాగా సునీత తమను చంపేందుకు కుట్ర చేస్తున్నారని, ఏపీ పీసీసీ అధ్యక్షురాలిని దూషిస్తున్నారంటూ సదరు ఫేక్ ఐడీ వివరాలను హైదరాబాద్ పోలీసులకు అందజేయడం గమనార్హం. టీడీపీ నేతలే పోస్టులకు కారణమని ఆమెకు కూడా తెలుసు. కాకపోతే కుట్రలో తనవంతు పాత్ర పోషిస్తోంది.
దొరికారు..
పోలీసులు విచారణ చేయగా ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి పోస్టులు పెడుతున్న వ్యక్తులు ఎవరో తేలింది. వారే విశాఖపట్నంలోని మహారాణిపేటకు చెందిన తండ్రీకొడుకులు పినపాల ఉదయ్ భూషణ్, చంద్ర కిరణ్. వీరద్దరూ ఫేక్ ఐడీలతో షర్మిలను దూషించినట్లు తేలింది. దీని కోసం వైఎస్సార్సీపీ కార్యకర్త పేరు, ఫొటో వాడుకున్నారు. ఇంకా విచారణలో వీరు మాలతిరెడ్డి టీడీపీ, కార్తీక్రెడ్డి టీడీపీ అకౌంట్లు నిర్వహిస్తూ జగన్, మంత్రులు, వైఎస్సార్సీపీపై రాయలేని భాషలో తిడుతున్నట్లు బయటపడింది.
టీడీపీకి బాధ ఎందుకో..
అభివృద్ధి, సమస్యలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సరే. కానీ లోకేశ్ గ్యాంగ్ జగన్ను తిట్టేందుకు డబ్బులిచ్చి మనుషులను నియమించుకుంది. వాళ్లు ఫేక్ ఐడీలతో రెచ్చిపోతున్నారు. తండ్రీకొడుకులను పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకుంటే అక్కడి టీడీపీ సౌత్ ఇన్చార్జి గండి బాబ్జీకి కోపం వచ్చింది. వెంటనే ప్రెస్మీట్ పెట్టారు. అసలు మహిళపై ఆ పోస్టులేంటని తమ వారిని కోప్పడకుండా.. ప్రభుత్వం, పోలీసులపై విరుచుకుపడ్డారు. ఉదయ భూషణ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని చెప్పారు గానీ ఆయన చేసిన నీచమైన పనుల గురించి ఆలోచించలేదు. ఇలా తమ వాళ్లు పెట్టే దారుణమైన పోస్టులకు మద్దతు తెలిపితే జనాలు ఊస్తారనే ఆలోచన కూడా చేయడం లేదు టీడీపీ నాయకులు. లోకేశ్.. ఎర్రబుక్కు పేరుతో ప్రత్యర్థులను మళ్లీ భయపెట్టొచ్చు గానీ ముందు మీ వాళ్లకు బుద్ధి చెప్పమని సోషల్ మీడియా వేదికగా పలువురు వ్యాఖ్యణించడం గమనార్హం.