– నెల్లూరు రా కదలిరా సభలో చంద్రబాబు
– చెప్పిందే చెప్పి విసిగించిన వైనం
– అంతా నా వల్లే.. నేనే చేశానని సొంత డబ్బా
– సభకు జన స్పందన కరువు
సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మించిన వ్యక్తి మరొకరు లేరు. నెల్లూరులో ఆదివారం జరిగిన రా కదలిరా సభలో బాబు తన ప్రసంగంలో పాత పాటలే మళ్లీ మళ్లీ పాడారు. దీంతో వచ్చిన కొద్దిపాటి నాయకులు, కార్యకర్తలు విసుగెత్తిపోయారు. హైదరాబాద్ నగరం కట్టింది తానేనని, అది దేశంలోనే బ్రహ్మాండంగా ఉందంటే.. కారణం తాను వేసిన ఫౌండేషన్ అని ఎప్పుడూ చెప్పే మాటలు చెప్పాడు. వైఎస్సార్, తర్వాత వచ్చిన సీఎంలు నా ఫౌండేషన్ను కొనసాగించారని, దాని ఫలితాలను ప్రజలు అనుభవిస్తున్నారంటూ లేని గొప్పలు చెప్పుకొన్నాడు.
ఏదేదో చెప్పి..
సారా వ్యతిరేక ఉద్యమం నెల్లూరులోని మొదలైందని బాబు అన్నాడు. కానీ మద్యపానాన్ని ఆయనే ప్రోత్సహించిన విషయం జనం ఇంకా మర్చిపోలేదు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఫ్యాక్టరీలను వాడుకుని రాజకీయం చేసింది బాబు, ఎల్లో మీడియా. అయితే ఈ ప్రభుత్వం దాడి చేయడంతో ఆయన వేరే రాష్ట్రానికి పారిపోయాడని ఆరోపించాడు. రాజకీయాలు విరమించుకోవడానికి జగనే కారణమన్నాడు. కానీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టలేదని సాక్షాత్తు జయదేవ్ చెప్పాడు. తనను జైల్లో వేసినప్పుడు 80 దేశాల్లో తలుచుకున్నారని, కార్యక్రమాలు చేశారని, ఎంతో మంచి చేయబట్టే ఇది సాధ్యమైందని నారా వారు అన్నారు. అయితే ఇదంతా అబద్ధం. తెలుగుదేశం ఎన్నారైలు అమెరికా, బ్రిటన్ తదితర తక్కువ దేశాల్లో పెయిడ్ నిరసనలు తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి జగన్పై గళమెత్తారని బాబు అన్నాడు. ఆయన పాలన నచ్చక టీడీపీలో చేరినట్లు చెప్పారు. వారిద్దరూ గొప్ప వ్యక్తులని ఒకరంగా పొగిడాడు. వాస్తవానికి శ్రీధర్రెడ్డికి టికెట్ ఇచ్చేది లేదని వైఎస్సార్సీపీ అధిష్టానం చెప్పింది. నాలుగేళ్లపాటు టీడీపీ నాయకులకు విలన్గా కనిపించిన ఆయన ఇప్పుడు బాబుకు బాగా నచ్చేశాడు. పైగా ఈయన ఫోన్ను ట్యాప్ చేశారంట. కాల్ రికార్డింగ్ను ఇలా కూడా పిలుస్తారేమో బాబు గారు. మంత్రి పదవి ఇవ్వలేదని ఆనం అలిగి చివరికి బాబుతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్లిద్దరూ, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి బాబు డబ్బుకు అమ్ముడుపోవడంతో వైఎస్సార్సీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. నేనేం చేశానని జగన్ సిద్ధం సభలో అడిగాడని చెప్పి దీనికి తన డబ్బా కొట్టుకున్నాడు బాబు. ఎప్పటిలాగే ఐటీ ఉద్యోగాలు నా వల్లే వచ్చాయన్నాడు. అన్నా క్యాంటీన్లను 2019 ఎన్నికలు సమీపిస్తున్నాయనగా ప్రారంభించి అవి ప్రస్తుత సర్కారు తీసేసిందన్నాడు. వాటి నిర్మాణంలో బాబు పాల్పడిన అవినీతి అంతా ఇంతా కాదు. చంద్రన్న బీమా, పండుగ కానుకలు, వ్యవసాయ సబ్సిడీలు, విదేశీ విద్యరద్దు చేశారని చంద్రబాబు అన్నారు. వాస్తవానికి బీమా పథకం ప్రస్తుతం మరింత మెరుగ్గా కొనసాగుతోంది. లబ్ధిదారులకు నగదు సకాలంలో చేరుతోంది. వ్యవసాయ సబ్సిడీలు గతం కంటే బాగా ఇస్తున్నారు. విదేశీ విద్య పథకాన్ని ఎక్కువ మందికి వర్తింపజేశారు జగన్. పండగ కానుకల పేరుతో గత ప్రభుత్వం హెరిటేజ్కు ఎంత దోచిపెట్టిందో ప్రతి ఒక్కరికీ తెలుసు.
ఎప్పుడు ఇవే..
వైఎస్సార్సీపీ ప్రభుత్వం యువతకు సచివాలయాల్లో ఉద్యోగాలిచ్చింది. అయితే బాబు చులకనగా మాట్లాడాడు. సచివాలయాల్లో, వలంటీర్లు, మటన్ కొట్టులో, ఫిష్ మార్కెట్లో ఉద్యోగాలంట అని వెక్కిరించాడు. నేనొస్తా.. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తా.. డీఎస్సీ పెడతా.. ప్రభుత్వ ఉద్యోగాలిస్తా. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. 2014లోనూ ఇలాగే ఉద్యోగాల విషయంలో హామీ ఇచ్చి నెరవేర్చలేదు. నిరుద్యోగ భృతిని కూడా ఆఖరులో తెలుగు తమ్ముళ్లకు ఇచ్చుకున్నాడు. మీ భవిష్యత్ను బంగారు భవిష్యత్ చేస్తానంటూ చెప్పిందే చెప్పాడు. వాస్తవానికి అధికారం కావాల్సింది లోకేశ్ భవిష్యత్ కోసం. వ్యవసాయ శాఖ పనిచేస్తోంటే దానిని ఎత్తేశారంటూ ఏదో నొటికొచ్చింది చెప్పాడు.
చేసేస్తా..
అధికారంలోకి వస్తే అది పూర్తి చేస్తా.. ఇది పూర్తి చేస్తానంటూ ఎప్పటిలాగే చంద్రబాబు హామీలు కురిపించాడు. జిల్లాలోని ఎమ్మెల్యేలపై లేనిపోనివి చెప్పాడు. వాస్తవానికి ఎన్నికల హామీలు విస్మరించింది బాబే. అబద్ధాలు చెప్పి మోసం చేయడంలో ఆయన దిట్ట. అలాంటి వ్యక్తి సంక్షేమ పథకాలకు కేరాఫ్గా మారిన జగన్కు అబద్ధాల్లో పీహెచ్డీ ఇవ్వాలనడం ఆశ్చర్యంగా ఉంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసింది తానే అయితే ఈ ప్రభుత్వంలో బాగా అమలు కావడంలేదని ఆరోపించాడు. కానీ గణంకాలు చూస్తే జగన్ ఏం చేశారో తెలుస్తుంది. పారిశ్రామిక హబ్లు పెడతాం, అనుసంధానం చేస్తాం, ఎత్తిపోతల పనులు చేస్తాం, దగదర్తి ఎయిర్పోర్టు కడతాం.. ఇలా బాబు చెప్పుకొంటూ పోయాడు.
సాక్షిపై అక్కసు
సాక్షి పత్రికపై చంద్రబాబు మరోసారి అక్కసు ప్రదర్శించాడు. అందులో అంతా అబద్ధాలు రాస్తారని దానిని చదవొద్దన్నాడు. అసలు అబద్ధాలు రాసేదే ఈనాడు, ఆంధ్రజ్యోతి. బాబు అవి జగన్, వైఎస్సార్సీపీపై చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. ఎల్లో మీడియా లేకపోతే బాబు రాజకీయాలు చేయలేడు.
చాలా లేటుగా..
సభ ఉదయం మొదలు కావాల్సింది. అయితే ప్రాంగణానికి జనం రాలేదు. నాయకులు, కార్యకర్తల నుంచి స్పందన కరువైంది. దీంతో నారాయణ టీమ్ రంగంలోకి దిగి ప్రతి వీధిలో ఆటోలు పెట్టి.. డబ్బులిచ్చి మనుషుల్ని తరలించింది. దీంతో ఆలస్యంగా మధ్యాహ్నం జరిగింది.