తెలుగుదేశం పార్టీ నాయకులు నడిరోడ్డుపై హత్య చేసినా చంద్రబాబు నాయుడు వెనకేసుకొస్తారు. ఎల్లో మీడియా సహకారంతో దానిని ఆత్మరక్షణ కార్యక్రమంగా చిత్రీకరిస్తారు. ఇదంతా ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. నోవా అగ్రిటెక్ మాటున అక్రమాలకు పాల్పడిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విషయంలో ఇదే జరిగింది. మంగళవారం మార్టూరులో గ్రానైట్ పరిశ్రమల్లో తనిఖీలకు వెళ్లిన మైనింగ్, విజిలెన్స్ అధికారులపై ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడులకు తెగబడ్డారు. తనిఖీలు చేయొనిచ్చేది లేదంటూ మైనింగ్ ఏడీ, ఇతర అధికారులను దుర్భాషలాడారు. విచారణ జరిగితే అక్రమాలు వెలుగులోకి వస్తాయనే భయంతో ఏలూరి ఇలా చేశారు. మైనింగ్ ఏడీపై దాడిని అడ్డుకోబోయిన డ్రైవర్ను కొట్టి గదిలో బంధించారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే, ఆయన ఏడుగురు అనుచరులపై అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది అక్కడ జరిగింది.
కానీ చంద్రబాబు దీనిని తమకు అనుకూలంగా మార్చి చెప్పారు. మార్టూరులో తనిఖీల పేరిట మారణాయుధాలతో ఆరాచకం సృష్టించారట. ఏడీ స్థాయి అధికారి రౌడీలతో తనిఖీలు వెళ్లాడట. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు కేసులు పెట్టారట. ఈ ఘటన పోలీస్ శాఖ గౌరవాన్ని దిగజార్చిందంట. తమ ఎమ్మెల్యే మాత్రం ఏమీ తెలియని అమాయకుడట. ఇదంతా ఆయన మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఇదే బాబు స్పెషల్. ఎమ్మెల్యే అధికారులను భయపెట్టి దాడికి పాల్పడితే ఏమనకుండా అధికారులను తిట్టారు. ఈ విషయాన్ని సీఎం జగన్కు లింకు పెట్టి ఏపీలో పాలనా వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయని నోటికొచ్చింది చెప్పారు. డీజీపీ తక్షణమే వీఆర్ఎస్ తీసుకోవాలని డిమాండ్ చేసేశారు. అసలు జరిగిందొకటి అయితే నారా వారి మాటలు మాత్రం మరోలా ఉన్నాయి.
అసలు వ్యవస్థల్ని కీలుబొమ్మలా ఆడించాలంటే తర్వాతే ఎవరైనా.. అందుకు ఉదాహరణ జగన్పై జరిగిన హత్యాయత్నం కేసు. ఈ ఘటన జరిగిన వెంటనే కనీస ప్రాథమిక దర్యాప్తు జరగకముందే అప్పటి డీజీపీ ఆర్పీ ఠాగూర్ ప్రెస్మీట్ పెట్టి మరీ జగన్కు సానుభూతి తీసుకురావడం కోసమే నిందితుడు దాడికి పాల్పడ్డాడని ప్రకటించారు. ఇదీ చంద్రబాబు మార్క్ రాజకీయం. అధికారులను వేరే పార్టీలపై ఉసిగొల్పడం ఆయనకు తప్ప మరొకరికి తెలియదు.