తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సర్కారు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అస్తవ్యస్తంగా అమలయ్యేది. రుచి లేని.. ఉడకని ఆహారాన్ని విద్యార్థులకు పెట్టేవారు. పర్యవేక్షణ కొరవడటంతో నిర్వాహకులు ఏదో పెట్టామంటే పెట్టి మమ అనిపించేవారు. ఆ భోజనాన్ని తినలేక కొందరు పిల్లలు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకునేవారు. ఆ పరిస్థితిలేని పేద బాలలు బడిలో పెట్టే ఆహారాన్నే కష్టంగా తినేవారు. వారంలో రెండు కోడిగుడ్లను మహా కష్టంగా అందించేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం స్వరూపమే మారింది.
పేద, మధ్య తరగతి తల్లిదండ్రులకు తమ పిల్లల చదువు భారం కాకూడదనే మహోన్నత ఆశయంతో పలు పథకాలకు ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తోంది. అందులో భాగంగా అమ్మఒడి, జగనన్న విద్యాకానుక వంటివి అందిస్తోంది. నాడు – నేడు పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేసిన సీఎం జగన్మోహన్రెడ్డి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై ప్రత్యేక దృష్టి సారించారు. మెనూలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. జగనన్న గోరుముద్ద పేరుతో పౌష్టికాహారానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రోజుకో వంటకాన్ని.. ఇంటి భోజనంలా రుచిగా, శుచిగా అందిస్తున్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించగలరనే నమ్మకంతో మెనూలో సమూలంగా మార్పులు తెచ్చారు. రక్తహీనత, బలవర్థక ఆహారం కోసం రాగిజావ, చిక్కీలు అందిస్తున్నారు. మంచినీటి కోసం ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. చక్కటి పౌష్టికాహారాన్ని అందించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, గురుకుల, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలలు, ఇంటర్ విద్యార్థులకు జగనన్న గోరుముద్ద అందిస్తున్నారు. ఈ పథకాన్ని విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక మెనూ విషయానికొస్తే సోమవారం హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు/కూరగాయల పులావు, కోడిగుడ్డు కూర, చిక్కీ, మంగళవారం చింతపండు/నిమ్మకాయ పులిహోర, టమాటా పచ్చడి/దొండకాయ పచ్చడి, కోడిగుడ్డు, బుధవారం కూరగాయల అన్నం, బంగాళదుంప కుర్మా, కోడిగుడ్లు, చిక్కీ, గురువారం సాంబార్ బాత్, ఉడికించిన కోడిగుడ్డు, శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, కోడిగుడ్లు, చిక్కీ, శనివారం ఆకుకూర అన్నం, పప్పుచారు, తీపి పొంగలి పెడుతున్నారు.
జగన్ హయాంలో విద్యా రంగానికి చేసిన ఖర్చు రూ.71,017 కోట్లు. ఇక గోరుముద్ద కోసం పెట్టిన నిధులు రూ.4,417 కోట్లు, లబ్ధిదారులు 43,26,782 మంది. రోజూ విద్యార్థులకు పౌష్టికాహారం అందుతోందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని, మెనూ ప్రకారం విద్యార్థులకు కమ్మనైన ఆహారాన్ని అందిస్తున్నామని వెల్లడిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో డీఈఓలు, డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, ఇతర శాఖల అధికారులు రోజూ మధ్యాహ్నం సమయంలో ఈ భోజనాన్ని పరిశీలిస్తున్నారు. ఏమైనా లోపాలుంటే అప్పటికప్పుడు సరిదిద్దుతున్నారు. జగన్ ఎంతో చిత్తశుద్ధితో ఈ పథకాన్ని అమలు చేయిస్తున్నారు.