వైయస్సార్ ఉండగా కాంగ్రెస్ పార్టీలో అధిక ప్రాధాన్యత కలిగిన రాజకీయ కుటుంబంలో ఒకరైన “గల్లా” ఫ్యామిలీ నుంచి వచ్చిన గల్లా జయదేవ్ త్వరలో పార్టీ మారబోతున్నారా?? అంటే అవుననే అంటున్నాయి గుంటూరు రాజకీయాలు.
కాంగ్రెస్లో ఉండగా ఎమ్మెల్యే టిక్కెట్లు చులాగ్గా గల్లా వారి ఇంటి తలుపు తట్టేవి. తెలంగాణ విభజన తర్వాత, ఆంధ్రాలో కాంగ్రెస్ నేలమట్టం అయ్యాక కొన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న గల్లా కుటుంబం నుంచి గల్లా జయదేవ్ టీడీపీ కండువా కప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. పార్టీ మారి వచ్చి వారికి చంద్రబాబు చేసే రాయల్ ట్రీట్మెంట్ తో ఊహించినట్టుగానే ఆయనకి ఎంపీ అభ్యర్ధిత్వం కూడా లభించడం, గెలవడం కూడా జరిగింది.
అయితే గెలిచిన తర్వాత జయదేవ్ తన ఎంపీ పనులు, వ్యాపారాలు చేసుకోవడం తప్ప… టీడీపీలో యాక్టివ్గా లేరు. గుంటూరు మునిసిపల్ ఎన్నికలపుడో, లోకేష్ పాదయాత్ర చేసినపుడో, అమరావతి రైతుల సమ్మె పిలుపుల్లోనో… ఎందులోనూ ఆయన పాత్ర లేకుండా, అంటీముట్టనట్టు గా వ్యవహరిస్తూ వచ్చారు.
అయితే టీడీపీ వాళ్ళు జగన్కి వ్యతిరేకంగా చేసే ప్రచారాల్లో భాగంగా తరచూ జయదేవ్ వ్యాపారాలకి ప్రభుత్వం ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పడం, పదేపదే తన వ్యాపార సంస్థల పేర్లను రాజకీయ ఆరోపణలలో వాడుతూ ఉండటం వంటి వాటి వల్ల జయదేవ్ టీడీపీ వైఖరి పట్ల కినుక వహించారని సమాచారం.
ఈ నేపథ్యంలో బుధవారం వైసీపీకి చెందిన ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి జయదేవ్తో సుదీర్ఘ మంతనాలు సాగించారని తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో జగన్తో కూడా సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయని, జయదేవ్ పార్టీ మారనున్నారని జోరుగా వార్తలందుకున్నాయి. అదే జరిగితే విజయవాడ, గుంటూరులో నుండి బలమైన సామాజిక వర్గ నాయకులను టీడీపీ కోల్పోయినట్టే. ఇప్పటికే కేశినేని నాని వైసీపీలో జతకట్టి టీడీపీకి సవాలు విసరడంతో, ఇపుడు జయదేవ్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటే.. టీడీపీ యొక్క బలమైన నియోజకవర్గాలలో పట్టును నెమ్మదిగా కోల్పోతున్నట్టే!!