ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మక ఉచిత విద్యుత్ ఫైల్పై డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేత సంతకం చేయించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటలో శుక్రవారం తెల్లవారుజామున తన రెండో కుమారుడి నివాసంలో మృతిచెందారు. ఆయన నాలుగు సంవత్సరాలుగా అల్జీమర్స్తో బాధపడుతున్నారు. స్వస్థలం ఉత్తరప్రదేశ్. 1977 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిల హయాంలో సీఎస్గా వ్యవహరించారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. వివిధ హోదాల్లో పనిచేసి 2010లో పదవీ విరమణ చేశారు. అనంతరం రోశయ్య హయాంలో సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్గా ఉన్నారు.
2004లో రాజశేఖరరెడ్డి సీఎం అయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఉచిత విద్యుత్ ఫైల్పై సంతకం చేస్తానని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జన్నత్ హుస్సేన్ ఆ బాధ్యత తీసుకుని ఉచిత విద్యుత్ పథకాన్ని రూపొందించారు. హైదరాబాద్లోని లాల్బహదూర్ స్టేడియంలో అశేష జనవాహిని నడుమ వైఎస్సార్ చేత సంబంధిత ఫైల్పై తొలి సంతకం పెట్టించి హుస్సేన్ చరిత్రకెక్కారు. ఆ ఒక్క సంతకంతో ఉమ్మడి రాష్ట్రంలో 43 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి చేకూరింది. ఈయన మృతిపట్ల రాజకీయ నాయకులు, అధికారులు సంతాపం ప్రకటించారు.
జగన్ సంతాపం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్నత్ హుస్సేన్ మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు.