ప్రభుత్వ పాలనను ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రజలు వద్దకు తీసుకెళ్ళడంలో దేశానికే రోల్ మోడల్గా నిలిచిన వాలంటీర్లను జగన్ ప్రభుత్వం వివిధ అవార్డులతో సత్కరించనుంది. కేవలం గౌరవ భృతితో పని చేస్తున్న వాలంటీర్లకు ఈ వార్త ప్రోత్సాహం కలిగించనుంది. 2.55 లక్షల మంది వలంటీర్లకు అవార్డులు..పురస్కారాలు లభించనున్నాయి. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సీఎం జగన్ ఈ అవార్డులను అందించనున్నారు.
అవార్డుల వివరాల్లోకి వెళితే… ప్రతి శాసనసభా నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వలంటీర్ల చొప్పున.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 875 మంది వలంటీర్లకు సేవావజ్ర అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్, రూ.45,000 చొప్పున నగదు బహుమతి అందజేస్తారు.
ప్రతి మండలం లేదా మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 10 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4,150 మందికి సేవారత్న అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్, రూ.30,000 చొప్పున నగదు బహుమతి అందిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన మిగిలిన 2,50,439 మంది వలంటీర్లకు సేవామిత్ర అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, రూ.15,000 చొప్పున నగదు బహుమతిని అందజేయనున్నారు.
సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర కలిపి మూడు కేటగిరీల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,55,464 మందికి మొత్తం రూ.392 కోట్ల నగదును బహుమతుల రూపంలో అందిస్తారు.
సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర మూడు కేటగిరీ అవార్డులకు అదనంగా వైఎస్సార్ పెన్షన్ కానుక, ఆసరా తదితర పథకాల లబ్ధిదారుల మనోభావాలను అత్యుత్తమంగా సేకరించి, జిల్లా కలెక్టర్లు ఎంపిక చేసిన 997 మంది వలంటీర్లకు వేరేగా ప్రత్యేకంగా నగదు బహుమతులను కూడా ప్రభుత్వం గురువారం అందించనుంది. ఈ వార్త పట్ల వాలంటీర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.