వంగా గీత వైఎస్సార్సీపీ వీడి జనసేనలోకి రావాలని ఆశిస్తున్నానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యాఖ్యలకు వంగా గీత కౌంటర్ ఇచ్చారు. 2009 కంటే ముందు నుండే రాజకీయాల్లో ఉన్నానని నేను కూడా పవన్ను వైయస్ఆర్సీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందని వంగా గీత వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరఫున వంగా గీత గెలిచారు. ఆమె వైఎస్సార్సీపీ వీడి జనసేనలోకి రావాలని ఆశిస్తున్నా అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా 2009 కంటే ముందు నుంచే తాను రాజకీయాల్లో ఉన్నానని, 2009లో చిరంజీవి తనకు అవకాశం ఇచ్చారని వంగా గీత వెల్లడించారు. పిఠాపురంలో గెలుపుపై పవన్ కళ్యాణ్వి దింపుడు కళ్లెం ఆశలని ఎద్దేవా చేసిన ఆమె పిఠాపురం నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు తనకే ఉందని, గెలుపు కూడా తనదేనని వంగా గీత ధీమా వ్యక్తం చేశారు.
కాగా వంగా గీత 1983లో రాజకీయాల్లోకి వచ్చారు. 1989 నుంచి 93 వరకూ మహిళా శిశు సంక్షేమ రీజనల్ చైర్ పర్సన్గా కొనసాగిన ఆమె 1995లో కొత్తపేట జెడ్పీటీసీగా సేవలందించారు. 1995 నుంచి 2000 వరకూ తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్గా పని చేసారు. 2000 నుంచి 2006 వరకూ రాజ్యసభ సభ్యురాలిగా, చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసిన వంగా గీత 2009 నుంచి 2014 వరకూ పిఠాపురం ఎమ్మెల్యేగా పని చేసారు. 2019లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కాకినాడ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2024 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు.