తెలుగుదేశంకి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థపై ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేశాడు. నిమ్మగట్టు ప్రసాద్ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి దూరం పెట్టింది. సంక్షేమ పథకాలకు వలంటీర్లను ఉపయోగించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు లబ్ధిదారులకు డబ్బు పంపిణీని చేయవద్దని ఆంక్షలు విధించింది. దీంతో అధికార యంత్రాంగం కొత్త మార్గదర్శకాలు సిద్దం చేసింది. వాలంటీర్లతో సంబంధం లేకుండా లబ్దిదారులకు పెన్షన్లు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ వ్యవస్థ ద్వారా పంపిణీ జరగనుంది.
వాలంటీర్లు ద్వారా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 66 లక్షల మంది పెన్షన్ అందుకుంటున్నారు. ప్రతీ నెలా వాలంటీర్లు లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఎన్నికల సంఘం ఆంక్షలతో వాలంటీర్లు అందిస్తున్న విధానంకు బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకూ ప్రత్యామ్నాయ మార్గం ద్వారా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అయితే, తాజాగా అధికారుల నుంచి అందుతున్న సమాచారం మేరకు కొత్త మార్గదర్శకాలు సిద్దం అయ్యాయి. వీటి మేరకు ఇక నుంచి మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున వాలంటీర్ ల ద్వారా పెన్షన్ పంపిణి చేయటానికి వీలు లేదని అన్ని సచివాలయాలకు అధికారులు స్పష్టం చేసారు. లబ్దిదారుని సంబంధిత వార్డు, గ్రామ సచివాలయంలో వున్న స్టాఫ్ అందరు కలిసి సచివాయలం వద్ద మాత్రమే పెన్షన్ పంపిణీ చేసేలా నిర్ణయించారు.
సచివాలయంలో పంపిణీ పెన్షన్ తీసుకొనేందుకు వచ్చే లబ్దిదారులు ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచిస్తున్నారు. పెన్షన్ దారులు పెన్షన్ పాస్ బుక్ తీసుకు రాకూడదని, ఇందులో ముఖ్యమంత్రి ఫోటో ఉండటంతో ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా పేర్కొంటున్నారు. సచివాయలం వద్ద పెన్షన్ దారులు ఎటువంటి తొక్కిసలాట లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అందరికి తప్పనిసరిగా పెన్షన్ అందజేయడం జరుగుతుందని తెలియజేయాలని నిర్దేశించారు. వాలంటీర్ ల వద్దవున్న మొబైల్, బయోమెట్రిక్ పరికరం జిల్లా ఎన్నికల అధికారి వారికి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉన్నందున బయోమెట్రిక్ పరికరాలు ఏవి అవసరం అవుతాయో అవి మాత్రం సచివాలయంలో ఉంచుకొని మిగిలినవి మాత్రమె హ్యాండ్ ఓవర్ చేయాలని సూచించారు.
గతంలో చెప్పినట్లు అధికారులు పంచాయతీ సెక్రెటరీ/వెల్ఫేర్ అసిస్టెంట్ ల ద్వారా సచివాలయంలోనే పెన్షన్ పంపిణీ జరుగుతుందని అధికారులు తెలిపారు. తీవ్ర అనారోగ్యానికి గురై మంచం మీదే పరిమితం అయిన వారికి సంబంధించి ఏ విధంగా పంపిణి చేయాలి అనే విషయం తరువాత తెలియచేస్తామని అధికారుల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. సచివాలయ సిబ్బంది అందరికి త్వరలోనే లాగిన్స్ ఇవ్వనున్నారు. దీని ద్వారా అందరికి అన్ని పేర్లు కనబడతాయని, క్లస్టర్ వారి మాపింగ్ లు వుండవని మార్గదర్శకాల్లో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే, లబ్దిదారులకు ఇంటి వద్దనే పెన్షన్ అందేలా చూడాలనే వినతులు వస్తున్నాయి. దీంతో ఈ నిబంధనలు సడలించి ఇంటి వద్దే పెన్షన్ ఇస్తారా..లేక, వీటినే అమలు చేస్తారా అనేది ఉన్నతాధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పెన్షన్ పంపిణీ చేయకపోవడంతో ఇప్పటికే టిడిపి వారిపై పెన్షన్ దారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.