ఏపీలో రాజకీయాలన్నీ పెన్షన్ చుట్టూనే తిరుగుతున్నాయి. వలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయించొద్దని టీడీపీ అనుకూల వ్యక్తిగా పేరొందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ వేయడం దానికి స్పందించిన ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ చేయొద్దని ఆదేశాలు ఇవ్వడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. మండుటెండల్లో వృద్దులు ఇబ్బందిపడుతుండడంతో వైసీపీ, టీడీపీ వల్లే పెన్షన్లు ఇంటిదగ్గర ఇవ్వడం ఆగిపోయాయని విమర్శించింది. దానికి తోడు కొందరు వృద్దులు మృత్యువాత పడుతుండడం టీడీపీని ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టేసింది. వృద్దులు వికలాంగులు పెన్షన్లు తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఆగిపోవడానికి కారణమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఎంత పెన్షన్ వస్తుందో అన్న చర్చ సర్వత్రా మొదలైంది. 1982 లో ఐఏఎస్ గా ఎంపికయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ 1984 లో సబ్ కలెక్టరుగా వృత్తిని ప్రారంభించి వివిధ విభాగాల్లో, వివిధ హోదాల్లో పనిచేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా పనిచేశాడు. చివరిగా గవర్నరుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, 2016 మార్చి 31న పదవీ విరమణ చేశాడు. దీంతో అతని పే స్కేల్ ప్రకారం సుమారు రూ. 1,25,000 పెన్షన్ గా వస్తుందని, మరో రూ. 62,500 డీఆర్ గా లభిస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 62 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు. లక్షల్లో పెన్షన్ పొందుతున్న ఒక వ్యక్తి ఓ పార్టీకి లబ్ది చేకూర్చడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 3000 కోసం ఎదురుచూసే పండుటాకుల్లాంటి వృద్ధులను ఇబ్బందిపెట్టడం భావ్యమా అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.