ఏపీలో ఎన్నికలు మరో కొద్ది రోజుల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీలోకి కొందరు నేతలు చేరుతుండగా మరికొందరు నేతలు వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ప్రకాశం జిల్లా కీలక నేత ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు. పర్చూరు ఇన్చార్జ్ గా ఉన్న కృష్ణమోహన్ చీరాల టికెట్ ఆశించి పర్చూరు వైసీపీ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. కాగా ఆయనకు టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెందారు.
ఆమంచి కృష్ణమోహన్ మొదటినుండి వివాదాస్పద నేతగా పేరు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. చీరాల నుండి పోటీకి దిగిన ఆమంచి 2019 ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనను పర్చూరు ఇన్చార్జ్ గా వైసీపీ అధిష్టానం నియమించింది. కాగా అక్కడ ఉన్న స్థానిక నేతలను కలుపుకుపోవడంలో విఫలమైన ఆమంచి కృష్ణమోహన్ కొందరు నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పర్చూరులో ప్రజల నుండి దూరం జరిగారు. ఈ నేపథ్యంలో ఆమంచికి టికెట్ నిరాకరించడంతో వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ నెల 9న తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు.
కాగా ఆయన వైసీపీకి రాజీనామా చేయడంతో ఏ పార్టీలోకి వెళ్లనున్నారనే చర్చ జోరుగా సాగుతుంది. టీడీపీ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తన మాట వినడం లేదని రోజాకి భన్వర్ లాల్ కి మధ్య సంబంధం ఉందని చంద్రబాబు చెప్పమన్నట్లు బహిరంగంగా వెల్లడించిన ఆమంచి తిరిగి టీడీపీ వైపు వెళ్లే యోచన ఉంటే బాబు ఆమంచిని పార్టీలోకి రానిస్తారా అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతుంది. కాగా ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తారు. ఆమంచి అడుగులు ఎటువైపో తేలాలంటే ఏప్రిల్ 9 వరకూ ఆగాల్సిందే.