ఏపీ ఎన్నికల సంగ్రామంలో మరో కీలక ఘట్టం నిన్నటితో ముగిసింది. ఎన్నికల పోరులో ఏఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు నిలబడుతున్నారో , స్వతంత్రులకు ఏ సింబల్ కేటాయించారో ఎలక్షన్ కమీషన్ ప్రకటించింది. మిగతా అభ్యర్థులు, గుర్తుల కన్నా జనసేన గుర్తు, ఆ గుర్తు పై పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఎన్నికల చరిత్రలో లేని గందరగోళం నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే జన సేన పార్టీ పోటి చేసే స్థానాల్లో మాత్రమే వారికి గాజు గ్లాసు గుర్తు కేటాయించింది ఎలక్షన్ కమీషన్, మిగతా చోట్ల ఎవరు కోరుకుంటే వారికి గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. రాష్ట్రం వ్యాప్తంగా చూస్తే జనసేనకు కేటాయించిన 23 స్థానలూ కాకుండా రెబెల్, స్వతంత్ర ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు 21 మందికి గాజు గ్లాసు గుర్తు కేటాయించింది ఎన్నికల కమిషన్ . జనసేన నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో కలుపుకొని లెక్క వేస్తే మొత్తంగా గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేస్తున్నది 44 మంది అభ్యర్థులు .
జన సేన తరుపున పోటీ చేస్తున్న 21 మంది ఎంఎల్ఏ, ఇద్దరు ఎంపీ అభ్యర్థుల్లో చూస్తే టీడీపీ నుండి వచ్చిన వారు 8 మంది ఉన్నారు, అలాగే వైసీపీ నుండి వచ్చిన వారిలో నలుగురు ఉన్నారు. అంటే మొత్తం 23 లో 12 మంది బయటి వారికి టికెట్లు ఇవ్వగా నికరంగా జనసేన వారు గ్లాసు గుర్తు పై పోటీ చేస్తుంది 11 మంది మాత్రమే .
అలాగే జన సేన బలమైన సీట్లు తీసుకోకుండా టీడీపీ ఇచ్చిన సీట్లు తీసుకొని పోటిలో నిలబడ్డారు. అప్పటి నుండి జన సైనికులు ఎవరికి ఓటు వెయ్యాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో సగం నియోజకవర్గాల్లో స్వతంత్రులకు జన సేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసు ను కేటాయించడంతో తమ నియోజకవర్గాల్లో జన సేన పోటిలో లేకపోయినా మన జన సైనికుడే గాజు గ్లాసు గుర్తు పై పోటీ చేస్తున్నాడు కాబట్టి దానికే ఓటు వేస్తాం అంటూ పక్క చూపులు చూస్తున్నారు ముందూ వెనకా చూసుకోని జన సైనికులు .
ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా కూటమి లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు కూటమి ధర్మం పాటించి మిగతా నియోజకవర్గాల్లో పవన్ పర్యటించి గాజు గ్లాసు గుర్తుకి ఓటేయవద్దు అని ప్రచారం చేస్తాడా లేదా అనేది ఆసక్తికరం