‘రైతన్నను రాజుగానే చూశాం. వారిని గా గుండెల్లో పెట్టుకుని పరిపాలన చేశా. మనది రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పడానికి గర్వపడతున్నా’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర మూడోరోజు ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
ఈరోజు పగటిపూటే 9 గంటలపాటు క్వాలిటీ ఉచిత విద్యుత్ అందుబాటులో ఉంది. చంద్రబాబు నాయుడి హయాంలో రాత్రి పన్నెండు గంటలకో, ఒంటి గంటకో కరెంట్ వచ్చేది. గ్రామగ్రామాన విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి రైతన్నను ఆర్బీకేల ద్వారా చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. సున్నావడ్డీ పంట రుణాలు అందించాం. ఎప్పుడూ చూడనివిధంగా ఉచిత పంటబీమా ఇస్తున్న ప్రభుత్వం కూడా మనదే. ఎప్పుడైనా పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. సాయం చేసే విషయంలో రైతన్నను నీది ఏ కులం, ఏ మతం, ఏ పార్టీ అని అడగలేదు. రైతును రైతులా చూసిన ప్రభుత్వమిది. 35 లక్షల ఎకరాలకు సంబంధించి శాశ్వత భూహక్కులను కల్పించి ప్రభుత్వమిది. ప్రతి రైతన్నను కోరుతున్నాను. అక్కాచెల్లెమ్మ మాదిరిగానే రక్షాబంధనం కట్టాలి. ఎన్నో మార్పులు కళ్లెదుటే కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ భుజం తట్టి మీమంతా నీకు తోడుగా ఉన్నామని చెప్పాలని కోరతుతున్నాను.
రైతు పేరు పలకడమే ఓ నేరంగా భావించే పార్టీలు, వారిని మోసం చేయడమే పనిగా పెట్టుకున్న పార్టీలు, వ్యవసాయం దండగన్న వారికి మద్దతిస్తారా? లేక మీ ముఖంలో చిరునవ్వులు చూడాలని, వ్యవసాయాన్ని పండగగా మార్చిన మీ బిడ్డకు మద్దతు పలుకుతారా.. ఈ 58 నెలల కాలంలో కనీవినీ ఎరుగని విధంగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలంటూ అణగారిన వర్గాలకు భరోసా ఇచ్చిన ప్రభుత్వం ఇది. ఏకంగా 2.70 లక్షల కోట్లను నేరుగా బటన్ నొక్కి అందించాం. 75 శాతం పైచిలుకు వెనుకబడిన వర్గాలకే వచ్చాయని చెప్పడానికి సంతోషిస్తున్నా. గతంలోSరాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే మనం ఈ 58 నెలల కాలంలో ఏకంగా మరో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని చెప్పడానికి గర్వపడుతున్నా. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేశాం. రాజ్యసభ నుంచి ఎమ్మెల్సీల వరకు, ఎమ్మెల్సీల నుంచి మంత్రి పదవుల వరకు ఈ వర్గాలకే ఇచ్చాను. మీ అన్న ప్రభుత్వం సప్తవర్ణాల మిశ్రమని చెప్పడానికి గర్విస్తున్నా.
గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పండి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టుల్లో కేసులు వేయించిన పార్టీల భవిష్యత్తుకు సమాధులు కట్టండి. ఎస్సీ కులాలల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అన్నవారికి రాజకీయ భవిష్యత్ లేకుండా తీర్పునివ్వండని కోరుతున్నాను. బీసీల తోకలు కత్తిరిస్తానన్న బాబు తోకలు, బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి. మైనారిటీలకు నాన్నగారు ఇచ్చిన ఆ 4 శాతం రిజర్వేషన్లను పణంగా పెట్టడమే కాకుండా వారి మనోభావాలతో 30 ఏళ్లుగా చెలగాటమాడుతున్న బాబు గురించి ఆలోచన చేయమని కోరుతున్నా. చంద్రబాబు నాయుడికి నా అని పిలుచుకునే వర్గాలు పక్క రాష్ట్రంలో ఉన్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీరందరికీ తోడు ఓ దత్తపుత్రుడు. వీళ్లెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. 30 ఏళ్లుగా బాబు మోసాలు, అన్యాయాలు అందరికీ కనిపిస్తున్నాయి. ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే పథకం ఒక్కటి కూడా లేదు. ఇప్పటిలాగానే ఓ దత్తపుత్రుడ్ని తెచ్చుకున్నాడు. ఢిల్లీ నుంచి మోదీని తెచ్చుకున్నాడు. 650 హామీలతో మేనిఫెస్టో ఇచ్చాడు. ప్రజలకు గుర్తుండదు. మరిచిపోతారని భావించారు. ఇందులో రూ.87,612 కోట్ల రుణమాఫీ చేశాడా?.. రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేశాడా అని అడుగుతున్నా. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. కనీసం ఒక్కరికైనా ఒక్క రూపాయైనా డిపాజిట్ చేశారా.. ఇంటింటికీ ఓ ఉద్యోగమిస్తామన్నాడు. లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఇచ్చిన హామీలను గాలికొదిలేశాడు.
ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదు. మళ్లీ ఇదే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి మోదీని పొత్తులోకి తెచ్చుకున్నాడు. ఈరోజు సూపర్ సిక్స్ అట, సూపర్ సెవెన్ అట, ప్రతి ఇంటికీ కేజీ బంగారమట, ప్రతి ఇంటికీ బెంజ్ కారు కొనిస్తాడట. నేను అడుగుతున్నాను. మోసాల నుంచి మన రాష్ట్ర పేదల భవిష్యత్తును కాపాడుకోవాలా వద్దా . ఈ యుద్ధంలో నేను సిద్ధం మరి మీరంతా సిద్ధమేనా అడుగుతున్నాను. ఈ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఒక స్టార్ క్యాంపెయినర్గా బయటకు రావాలి. ఈ ఎన్నికల్లో మన టార్గెట్ 175 కు 175 ఎమ్మెల్యే స్థానాలు గెలవాలి. 25కు 25 ఎంపీ స్థానాలు గెలవాలి.
చంద్రబాబు శింగనమల నియోజకవర్గానికి వెళ్లి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శింగనమల ఎమ్మెల్యే టికెట్ను టిప్పర్ డ్రైవర్కు ఇచ్చిందని హేళన చేశాడు. అతని చదువుS గురించి కూడా అబద్ధాలు చెప్పాడు. అవునయ్యా చంద్రబాబ.. నేను పేదవాళ్లకు టికెట్లు ఇచ్చాను. వీరాజంనేయులు టిప్పర్ డ్రైవరే. బాబు కంటే పెద్ద చదువులు చదివాడు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బీఈడీ కూడా పూర్తి చేశాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగం దొరక్క.. తన కాళ్ల మీద తను నిలబడేందుకు టిప్పర్ డ్రైవరై కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 50 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే.. టికెట్లు ఇచ్చానని గర్వంగా చెబుతున్నాను. అదే అనంతపురం జిల్లాలో మడకశిర నియోజకవర్గం కూడా ఎస్సీలదే. మన అభ్యర్థి పేరు లక్కప్ప. రేపు చంద్రబాబు అక్కడివెళ్లి ఉపాధి హామీ కూలీకి టికెట్ ఇచ్చారని చెబుతాడు. జగన్ పేదవాళ్లను ఎదనివ్వడానికి అడుగులు వేస్తా ఉన్నాడని చెబుతున్నాను. ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి విరూపాక్ష కూడా పేదవాడు. అదేరకంగా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ. నాచెల్లెలు సౌమ్యురాలు, బీసీ కులానికి చెందిన మహిళ. ఆర్థికంగా అంతంతమాత్రంగానే ఉంది.
పత్తికొండ నియోజకవర్గానికి చెందిన శ్రీదేవి నా అక్కలాంటిది. నారాయణరెడ్డి అన్న చనిపోతే అండగా ఉన్నాను. కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి డా.సతీష్ సౌమ్యుడు, డబ్బులు కూడా అంతంతమాత్రమే కానీ మంచివాడు. కర్నూలు అభ్యర్థి ఇంతియాజ్ ఐఏఎస్ ఆఫీసర్. తన పదవికి రాజీనామా చేసి ఒక ముస్లిం ప్రతినిధిగా వచ్చాడు. ఈయనకు కూడా డబ్బులు అంతంత మాత్రమే. ఆదోని సాయన్న గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. మంత్రాలయం అభ్యర్థిగా బాలనాగిరెడ్డి మంచివాడు, సౌమ్యుడు. కానీ డబ్బులు విషయంలో మాత్రం అంతంతమాత్రమే. వారిపై మీ ఆశీస్సులు ఉండాలి. హఫీజ్ఖాన్కు కర్నూలు టికెట్ ఇవ్వలేకపోయాను. రెండేళ్ల తర్వాత మనకు వచ్చే రాజ్యసభకు ముస్లిం అభ్యర్థిగా ఈయన్ను పంపిస్తాను. ఇన్ని లక్షలమంది సమక్షంలో చెబుతున్నా. ఇదీ జగన్కు, చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా.