వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లిం వర్గానికి అండగా నిలిచారు. నాడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వారికి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇది ఎన్నికల హామీ కాదు. కానీ అమలు చేసి చూపించారు. 15 ఉప కులాలను బీసీ – ఈ జాబితాలో చేర్చి రిజర్వేషన్లను వర్తింపజేశారు. ఫలితంగా వేలాది మంది బాగా చదువుకుని ఉద్యోగాలు పొందారు. ధనికులకే పరిమితమైన వైద్య విద్యలో ఉచితంగా సీట్లు పొంది డాక్టర్లుగా స్థిరపడ్డారు. ఇక జగన్ విషయానికొస్తే తన కేబినెట్లో స్థానం కల్పించారు. వివిధ పదవుల్లో వారికి ప్రాధాన్యం ఇచ్చారు.
2019–20లో కరోనా మహమ్మారి కారణంగా హజ్ యాత్ర జరగలేదు. 2022లో దేశంలో ఎక్కడా లేని విధంగా 1,164 మందికి రూ.14.50 కోట్లు, 2023లో 1,813 మందికి రూ.14.50 కోట్ల ఆర్థిక సాయం చేశారు. ప్రతి సంవత్సరం అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇందులో స్వయంగా సీఎం జగన్ పాల్గొనేవారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 వేల మంది ఇమామ్లు, మౌజమ్లకు ఆర్థిక సాయం చేసింది ఈ సర్కారు. పేద ముస్లిం యువతుల వివాహానికి ప్రభుత్వం ఎంతగానో సాయం చేస్తోంది. గతంలో రూ.50 వేలు మాత్రమే ఉన్న షాదీ తోఫా ఇప్పుడు వైఎస్సార్ షాదీ తోపా కింద రూ.లక్ష అందిస్తున్నారు.
నెల్లూరు సిటీ సమన్వయకర్తగా సామాన్యుడైన ఖలీల్ అహ్మద్, కర్నూలుకు మాజీ ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ను ప్రకటించారు. మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముస్లింలపై కపటప్రేమ చూపించి ద్రోహిగా మిగిలిపోయారు. వారిని ఓట్ల కోసం వాడుకున్నాడే తప్ప సంక్షేమానికి పాటుపడలేదు. కేబినెట్లో ఒక్కరికి కూడా మంత్రిగా అవకాశం కల్పించలేదు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినా దీనిని నెరవేర్చలేదు. భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నప్పుడు కమలం పెద్దలు ఆగ్రహిస్తారని ఆ వర్గానికి న్యాయం చేయలేదు. తన అవసరాల కోసం వారికి దూరమయ్యాక మాత్రం ముస్లింలకు అండగా ఉంటానని ‘నారా హమారా.. టీడీపీ హమారా’ కార్యక్రమాల పేరుతో కబుర్లు చెప్పారు. ఇప్పుడు మళ్లీ కాషాయ పార్టీ చెంతన చేరాడు. ఏ ముఖం పెట్టుకుని ముస్లిం వద్దకు వెళ్తాడో..