ఆయన ఉండేది ఓ పార్టీలో.. పని చేసేది మాత్రం మరొక పార్టీకి.. ఎలక్టొరల్ బాండ్స్ ఇచ్చేది ఇంకో పార్టీకి.. ఇప్పుడీ వ్యవహారం బయటకు రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడాయన హాట్ టాపిక్ గా మారిపోయారు . ఆయనే సీఎం రమేష్. కాంగ్రెస్కు సీఎం రమేశ్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ 30 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒక్కొక్కటీ రూ.కోటి విలువ గల 30 బాండ్లను 14402, 14412, 14414, 14416, 14418, 14420, 14422, 14424, 14426, 14427, 14429, 14431, 14433, 14435, 14437, 14439, 14441, 14443, 14445, 14447, 14449, 14451, 14454, 14456, 14458, 14460, 14462, 14464, 14466, 14477 అంటే రూ.30 కోట్లను సీఎం రమేష్ కాంగ్రెస్కు అందజేశారు.
టీడీపీ తరపున రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సీఎం రమేష్ 2019లో టీడీపీ ఘోర ఓటమి అనంతరం బీజేపీ గూటికి చేరారు. ఆయనను బీజేపీలో చేర్చింది చంద్రబాబే అని రాజకీయ వర్గాల్లో గతంలో చర్చ జరిగింది. బీజేపీలో చేరినా చంద్రబాబు ప్రయోజనాల కోసమే సీఎం రమేష్ రాజకీయాలు చేస్తాడనే పేరుంది. 2019లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎం రమేష్ రిత్విక్ ప్రాజెక్ట్స్ అనే సంస్థను ప్రారంభించి అనతికాలంలోనే చంద్రబాబు అండదండలతో భారీ కాంట్రాక్టులు పొంది ఆర్ధికంగా బలంగా ఎదిగారు. చంద్రబాబు ఆదేశాలతో బీజేపీ గూటికి చేరి బాబు ప్రయోజనాల కోసం 2023లోనే తన రిత్విక్ ప్రాజెక్ట్ ద్వారా రూ.45 కోట్ల మేర ఎలక్టొరల్ బాండ్లను కొనుగోలు చేసి, అందులో రూ.30 కోట్లను కాంగ్రెస్ ఖాతాలోకి, రూ.5 కోట్లను తెలుగుదేశం ఖాతాలోకి, మరో 10 కోట్లను కర్ణాటకకు చెందిన జనతాదళ్ (ఎస్) ఖాతాలోకి వేశారు.
బీజేపీలో చేరినా ఒక్క రూపాయి కూడా బీజేపీకి ఇవ్వకుండా ఇతర పార్టీలకు సీఎం రమేష్ నిధులివ్వడం చూసి అందరు అవాక్కవుతున్నారు. ముఖ్యంగా బీజేపీ బద్ద శత్రువుగా భావించే కాంగ్రెస్ కు ఆయన నిధులు చేకూర్చడం చూసి రాజకీయవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కానీ చంద్రబాబు సూచనల మేరకే సీఎం రమేష్ కాంగ్రెస్ కి నిధులు ఇచ్చాడని ప్రచారం జరుగుతుంది. సీఎం రమేష్ ఇచ్చిన నిధుల కారణంగానే చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డికి, షర్మిలకు పీసీసీ ప్రెసిడెంట్ పదవులు దక్కాయని కొందరు ఆరోపిస్తున్నారు. సీఎం రమేశ్ కాంగ్రెస్ పార్టీకి నిధులిచ్చిన తర్వాత కాంగ్రెస్లో షర్మిల పార్టీని విలీనం చేయటంతో పాటు ఆమెను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నియమించారు.
అంతేకాకుండా జగన్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారందరికీ అవసరమైన ఖర్చులు పెట్టడం, ప్రత్యేక విమానాలు సమకూర్చటం వంటి పనులన్నీ సీఎం రమేష్ చేస్తుండడం గమనార్హం. సీఎం రమేష్ విమానాన్ని పవన్ కల్యాణ్, ప్రశాంత్ కిషోర్, షర్మిలలు వాడుతున్న విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా బీజేపీతో బాబును దగ్గర చేయడానికి తెరవెనుక మొత్తం కథ నడిపింది సీఎం రమేష్ అని తెలుస్తుంది. చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేస్తూ బీజేపీలో పాగా వేసి కాంగ్రెస్ కు నిధులిస్తున్న సీఎం రమేష్ గురించిన సమాచారం బీజేపీకి తెలుసో లేదో అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కాగా బీజేపీ తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేయనున్న సీఎం రమేష్ లీలలు బయటకొచ్చిన నేపథ్యంలో ప్రజలు ఎలా ప్రతిస్పందిస్తారో జరగబోయే ఎన్నికల ఫలితం ద్వారా తెలిసిపోతుంది.