తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు (కేసీఆర్)ను ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ ఎర్రబెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి ఆయన ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దీంతో ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది. సోమాజిగూడ లోని యశోద ఆస్పత్రిలో 8వ తేదీన డాక్టర్లు కేసీఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత కేసీఆర్ నంది నగర్ లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
గురువారం ఏపీ సీఎం హైదరాబాద్ చేరుకుని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. జగన్ కేసీఆర్ కు పూలబొకే అందజేసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.