తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు (కేసీఆర్)ను ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పరామర్శించనున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ ఎర్రబెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి ఆయన ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దీంతో ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది. సోమాజిగూడ లోని యశోద ఆస్పత్రిలో 8వ తేదీన డాక్టర్లు కేసీఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత కేసీఆర్ బంజారాహిల్స్ లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సినీ ప్రముఖులు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులు పరామర్శించారు. తాజాగా ఏపీ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు గురువారం హైదరాబాద్ వెళ్తున్నారు. పరామర్శానంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. కేసీఆర్, జగన్ల మధ్య సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. త్వరలో ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో వారి లంచ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.