‘ఐదు సంవత్సరాల్లో చిన్న గ్రామంలో ఎన్నో పనులు చేశాం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏ పొద్దయినా చేశారా?, ఒకసారి ఆలోచన చేయండి’ అని నంద్యాల జిల్లా శిరివెల్ల మండలం యర్రగుంట్ల గ్రామంలో వివిధ వర్గాలతో జరిగిన చర్చా కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సీఎం మాటల్లో.. గ్రామంలో రెండు సచివాలయాల పరిధిలో 3,005 ఇళ్లు ఉన్నాయి. ఒక సచివాలయం పరిధిలో 1,486 ఇళ్లకు గానూ.. ఏకంగా 1391 ఇళ్లు సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందాయి. అంటే 93.60 శాతం. అదే రెండో సచివాలయం పరిధిలో చూస్తే 1,519 ఇళ్లకు గానూ, 1,448 ఇళ్లకు చెందిన వారికి పథకాలు అందించాం. ఏకంగా 95.32 శాతం. ఈ 58 నెలల కాలంలో ఒక్క గ్రామంలోనే ఇంత మంచి చేయడం గతంలో చూశారా.. మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బు వెళ్లడం జరుగుతోంది. ఎక్కడా లంచాలు అడగడం లేదు. వివక్ష చూపించడం లేదు. ఏ కులం, ఏ మతం, ఏ వర్గమని అడగడం లేదు. చివరికి మీరు ఏ పార్టీ అని చూడడం లేదు.
ఈ ఊరి వాసులకు పథకాల ద్వారా రూ.48,74,34,136 నేరుగా అందింది. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద రూ.16,52,71,500, వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.6,80,96,500, అమ్మఒడి కింద 1,043 మంది తల్లులకు రూ.4,69,35,000, ఆసరా కింద రూ.3,88,16,374, చేయూత కింద 492 మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,96,25,000, విద్యా దీవెన కింద 837 మందికి రూ.2,46,41,602 కోట్లు, హౌసింగ్ కింద రూ.2,75,72,361, ఆరోగ్యశ్రీ కింద రూ.2,24,21,596, ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1,13,71,570 కోట్లు, వసతి దీవెన కింద రూ.1,00,98,149, సున్నావడ్డీ కింద రూ.86,48,916, క్రాప్ ఇన్సూరెన్స్ కింద రూ.67,26,205, జగనన్న తోడు కింద ఇచ్చిన లోన్లు రూ.41,30,000, కాపు నేస్తం కింద రూ.31,20,000, చేదోడు కింద రూ.40,40,000, ఆరోగ్య ఆసరా కింద రూ.21,48,200లు ఈ ఒక్క గ్రామంలోనే అందింది. నాన్ డీబీటీ పథకాలు కూడా ఒక్కసారి గమనిస్తే, 468 మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. 144 పూర్తయ్యాయి. 2,594 మందికి రైస్కార్డులు, 76 మంది 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు అందజేశాం. 670 మందికి విద్యాకానుక, 189 మంది సంపూర్ణ పోషణ కిట్లు ఇచ్చాం.
నా కన్నా చాలా అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునేవారు వారు ఉన్నారు. కానీ నేను ఒకటే అడుగుతున్నా. రాష్ట్రం విడిపోయిన తర్వాత నా కన్నా ముందు 75 ఏళ్ల ముసలయాన పరిపాలన చేయడం అందరూ చూశారు. ఆయన ఏకంగా 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు. ఆయన హయానికి.. మన పాలనకు తేడా చూడండి. ఈరోజు ఏరకంగా బతుకులు మారాయి?, జీవితాలు మారాయో గమనించండి. అక్కచెల్లెమ్మల కుటుంబాలకు ఆర్థిక సాధికారత ఇచ్చాం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు గ్రామాలు బాగుపడ్డాయి. స్కూళ్లు మారిపోయాయి. డిజిటల్ బోధన అందుబాటులోకి వస్తోంది. పిల్లల చేతుల్లో ట్యాబ్లు కనిపిస్తున్నాయి. ఇంగ్లి్ష్ చదువులు అందుబాటులోకి వచ్చాయి. విలేజ్ క్లినిక్స్ ఏర్పాటయ్యాయి. డాక్టర్లు ఇక్కడే వస్తున్నారు. ఆరోగ్య సురక్షతో ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ పేదవాడికి మందులు అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ విస్తరించింది. ఏకంగా 3,300 ప్రొసీజర్లకు తీసుకునిపోయాం. రూ.25 లక్షల వరకూ ఈరోజు పేదలు వైద్యం చేయించుకునే అవకాశం ఉంది. రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే కనిపిస్తోంది. అన్నదాతలను చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. ఇవన్నీ గతంలో ఉన్నాయా.. మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే మార్పు తీసుకొచ్చాడు. గమనించమని కోరుతున్నాను. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతున్నాను. ఒకసారి ఇంటికి వెళ్లండి. మీ ఇల్లాలితో మాట్లాడండి. మీ పిల్లలతో మాట్లాడండి. అవ్వాతాతలతో మాట్లాడండి. కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండి. మన తలరాతలు మార్చే ఎన్నిక ఇది. మీరేదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదైనా సలహాలు ఇవ్వాలని కోరుతున్నాను అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.