నామినేషన్ కోసం పులివెందుల వెళ్లిన సీఎం జగన్ సీఎస్ఐ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పసుపు మూకలతో తన చెల్లెమ్మలు కలిసి కుట్రలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్ వీళ్లా వైఎస్సార్ వారసులు అంటూ దుయ్యబట్టారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
వైఎస్సార్, జగన్లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. ఆ కుట్రలో భాగంగా ఈ మధ్య వైఎస్సార్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారు. అసలు ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు?.. ప్రజలే. మీ బిడ్డను ఎదుర్కొనలేక వీళ్లంతా ఏకం అయ్యారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీలతో పాటు నా ఇద్దరు చెల్లెమ్మలతో కుట్రలో భాగం అయ్యారు.
‘వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు?.. నాన్నగారిపై కక్షతో, కుట్రపూర్వకంగా కేసులు పెట్టింది ఎవరు?’ వైఎస్సార్ పేరును ఛార్జిషీట్లో పేర్కొంది ఎవరు?.. వైఎస్సార్ కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని, వైఎస్సార్సీపీకి పేరు దక్కవద్దని, విగ్రహాలు తొలగిస్తామని చెబుతున్నవాళ్లు, ఆ పార్టీలతో చేతులు కలిపినవాళ్లా? వైఎస్సార్ వారసులా?’ పసుపు చీరలు కట్టుకుని వైఎస్సార్ శత్రువులతో చేతులు కలిపిన వీళ్లా వైఎస్సార్ వారసులు?.. అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు.
బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో మీ అందరికీ కనిపిస్తోంది. పసుపు మూకలతో మన చెల్లెమ్మలు ఈ కుట్రలో భాగం కావడం దుర్మార్గం. చిన్నాన్న వివేకాను అన్యాయంగా ఎన్నికల్లో ఓడించిన వాళ్లతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వైఎస్సార్పై కుట్రలు చేసిన వాళ్లు అందిస్తున్న స్క్రిప్ట్ చదువుతున్న వీళ్లా వైఎస్సార్ వారసులు?. తమ సొంత లాభంకోసం ఎవరు ఈ కుట్ర చేయిస్తున్నారో ప్రజలు గమనించాలి. ప్రతీ ఒక్కరూ చెడిపోయిన ఈ రాజకీయాలను చూడండని సీఎం జగన్ సూచించారు.
నా చిన్నాన్న వివేకాను చంపింది ఎవరో దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. వివేకాను చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరు?. వివేకాకు రెండో భార్య ఉన్నది, సంతానం ఉన్నది వాస్తవం కాదా?. ఆనాడు ఎవరు ఫోన్ చేస్తే.. అవినాష్ అక్కడికి వెళ్లారు?. పలు ఇంటర్వ్యూల్లో అవినాష్ లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా!. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదు. అది బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చాను. అవినాష్రెడ్డి జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. అవినాష్ను కనుమరుగు చేయాలనుకోవడం ఎంత దారుణమో ఆలోచించండని అభ్యర్ధించారు.
కరువు ప్రాంతంగా ఉన్న పులివెందులకు కృష్ణా జలాలు వస్తున్నాయని.. తన తండ్రి, ఆ మహానేత దివంగత నేత వైఎస్సార్ వల్లే ఈ అభివృద్ధి పరుగులు పెడుతోంది. పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ ‘మనపై’ వేలెత్తి చూపిస్తున్నారు. మంచి మనసు, బెదిరింపులకు లొంగకపోవడం ఇక్కడి కల్చర్.. టీడీపీ మాఫియా, నాలుగు దశాబ్దాల దుర్మార్గాన్ని ఎదురించింది పులివెందుల బిడ్డే . పులివెందుల నా ప్రాణం ..పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్ స్టోరీ . ఈ అభివృద్ధికి కారణం వైఎస్సార్.. ఆయన బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది ఈ ప్రభుత్వమన్నారు. పులివెందుల వాసుల చిరకాల కల మెడికల్ కాలేజీ. త్వరలో ఆ కాలేజీ ప్రారంభిస్తామని సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు.