‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఏదైనా చేస్తా. జగనన్నకు నా ఉపయోగం ఏ ఊరిలో ఉంటే అక్కడికి వెళ్తా. ఎంపీగా పోటీ చేయాలన్నారు. సరేనన్నాను. ఆయన మాటకు అడ్డు చెప్పే ప్రసక్తే లేదు’ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలివి. జగన్ ఆయన్ను నరసారావుపేట పార్లమెంట్ ఇన్చార్జిగా నియమించిన విషయం తెలిసిందే. నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ను సిటీకి సమన్వయకర్తగా నియమించారు. ఈ నేపథ్యంలో ఆదివారం అనిల్ నెల్లూరులోని తన కార్యాలయం వద్ద ఖలీల్ పరిచయ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక విషయాలపై అనిల్ స్పష్టత ఇచ్చారు. తనను సిటీ నుంచి తరిమేశారని సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయన్నారు. అందులో నిజం లేదన్నారు. జగనన్న నా సేవలు మరో జిల్లాలో అవసరమని గుర్తించి ఎంపీగా పోటీ చేయాలని ప్రమోషన్ ఇచ్చారన్నారు. చాలామంది టీడీపీ నాయకుడు నారాయణ ముందు ఖలీల్ సరిపోతాడా అంటున్నారు. రాజకీయాల్లో మహామహులు, కోట్ల రూపాయల ఆస్తులున్న వారు సామాన్యుల చేతిలో ఓడిపోయినట్లు చరిత్ర చెబుతోందన్నారు. ఖలీల్ మంచి వ్యక్తి అని, అందరికీ అందుబాటులో ఉంటాడన్నారు. ఒకవేళ రేపు ఆయన పనిచేయడం లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా ప్రశ్నిస్తానన్నారు. తాను నెల్లూరుకు దూరం కాలేదని, ప్రతి వారం ఇక్కడికి వచ్చి అందర్నీ కలుస్తానన్నారు. ఎప్పటి లాగే టీ అంగడికి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటానని చెప్పారు. తన కోసం ఎలా అయితే పనిచేశారో.. ఖలీల్ కోసం అలాగే పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముస్లింలకు జగనన్న అవకాశం ఇచ్చారని, దానిని నిలబెట్టాలన్నారు. ఇన్ని సంవత్సరాల్లో తెలిసో.. తెలియకో ఎవరిరైనా ఏమైనా అని ఉంటే క్షమించాలని విజ్ఞప్తి చేశారు. మనందరి లక్ష్యం జగనన్న మరోసారి సీఎం అవ్వాలి. దాని కోసమే కష్టపడి చేద్దామన్నారు.