సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ వ్యూహలు అర్థంగాక తెలుగుదేశం కకావికలమైపోతోంది. ఒకరిద్దరు నాయకుల్ని లాగేసి వైఎస్సార్ కాంగ్రెస్ను దెబ్బ కొట్టామని చంద్రబాబు నాయుడు సంబరపడిన ప్రతిసారి జగన్ మాస్ట్రర్ స్ట్రోక్ ఇస్తున్నారు.
వివిధ సమీకరణాలతో జగన్ అభ్యర్థులను మారుస్తున్నారు. కొందరిని వేరే నియోజకవర్గాలకు పంపుతున్నారు. మరికొందరికి టికెట్ లేదని ముందుగానే చెప్పేశారు. వీరిలో పలువురు పార్టీలోనే ఉండిపోగా.. మరికొందరిని చంద్రబాబు ప్రలోభాలకు గురిచేసి డబ్బుతో కొనుక్కుంటున్నారు. అందరూ టీడీపీ వైపు చూస్తున్నారని, వైఎస్సార్సీపీ పనైపోయిందని ఎల్లో మీడియా ద్వారా డప్పు కొట్టిస్తున్నారు. కానీ జగన్ ఎవరూ ఊహించని రీతిలో కొత్త అభ్యర్థులను తెరమీదకు తెస్తున్నారు. నెల్లూరు పార్లమెంట్ సీటు విషయంలో తెలుగుదేశానికి గట్టి షాక్ ఇచ్చింది వైఎస్సార్సీపీ అధిష్టానం.
వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి (వీపీఆర్) రాజ్యసభ సీటు ఇచ్చి అందలమెక్కించారు జగన్. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ సీట్ కూడా ఆయనకేనని చెప్పారు. కానీ చంద్రబాబు.. వెంకయ్య నాయుడి ద్వారా వీపీఆర్తో రాయబారం నడిపారు. బాబు ఎన్డీఏలో చేరితే కేంద్ర మంత్రి లేదా సహాయ మంత్రి పదవి వస్తుందని ఆశ పెట్టారు. దీనికి లొంగిపోయిన వేమిరెడ్డి టీడీపీలో చేరిపోయారు. ఇంకేముంది బడా పారిశ్రామికవేత్త మావైపు వచ్చేశాడు.. వందల కోట్లు కుమ్మరించి జిల్లాలో మేమే గెలుస్తామని తెలుగు తమ్ముళ్లు సంబరాల్లో మునిగిపోయారు. అయితే జగన్ అత్యంత వ్యూహాత్మకంగా రాజ్యసభసభ్యడు వేణుంబాక విజయసాయిరెడ్డిని వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంట్ సమన్వయకర్తగా ప్రకటించారు. దీంతో అవాక్కవడం టీడీపీ నేతల వంతైంది. వారి ఆనందం కాస్తా ఆవిరైపోయింది.
జగన్కు సన్నిహితుడైన విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల వాసి. సీఏ చేశారు. ప్రస్తుతం రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేయడంలో దిట్టగా పేరుంది. నేను బయటకు వెళ్లగానే జిల్లాలో వైఎస్సార్సీపీ ఖాళీ అయిపోతుందని వీపీఆర్ భావించారు. డబ్బులిచ్చి చోటా నేతల్ని తన వైపు తిప్పుకొన్నారు. కానీ విజయసాయిరెడ్డి రాకతో ఇక నా ఆశలన్నీ గల్లంతేనా అనే పరిస్థితికి వచ్చేశారు.
వీపీఆర్కు రాజకీయాల్లో అనుభవం తక్కువ. జన బలం లేదు. జగన్ పుణ్యాన వైఎస్సార్సీపీలో స్వర్ణయుగం నడిచింది. జిల్లా పెద్దగా వ్యవహరించారు. కానీ తెలుగుదేశంలో ఆ పరిస్థితి ఉండదని ఆయనకు కూడా తెలుసు. పార్టీ పెద్ద తానేనని నారాయణ చెప్పుకొంటుంటారు. సొంత బంధువైన సోమిరెడ్డి అండగా ఉన్నా డబ్బు కోసం తన చుట్టూ నేతలు మూగుతారనే భయంలో వేమిరెడ్డి ఉన్నారు. తెలుగు తమ్ముళ్లలో ఉన్న విభేదాల నడుమ ఆయన నలిగిపోవడం ఖాయం. దీనికితోడు ప్రత్యర్థి అత్యంత బలవంతుడు కావడం.. తనకంటూ ప్రత్యేక వర్గం లేకపోవడంతో ఎన్నికలకు ముందే వీపీఆర్ నైరాశ్యంలోకి వెళ్లే అవకాశాలు లేకపోలేదు. ఎంతో గౌరవించిన జగన్ను కాదనుకుని వెళ్లినందుకు బాధపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.