2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయం ప్రకటించారు. తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలతో ఎన్నికల బరిలో దూసుకుపోనున్నారు.
“ మేమంతా సిద్ధం “ పేరిట బస్సు యాత్ర నిర్వహించనున్నారు. రీజియన్ ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో జరిపిన సభల నిర్వహణ భారీ స్థాయిలో విజయవంతం అయ్యిన నేపథ్యంలో ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేయనున్నారు ముఖ్యమంత్రి.
బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల మధ్యకు వెళ్ళనున్నారు. బస్సు యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకూ జనంలోనే జగన్ ఉండనున్నారు. మరో వారం రోజుల్లో అంటే ఈనెల 26 లేదా 27 తేదీల్లో బస్సు యాత్ర ప్రారంభం కానుంది. దాదాపు 21రోజులపాటు బస్సు యాత్ర చేయనున్నారు. 4 సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా.. ప్రతి రోజూ ఒక జిల్లాలో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంటరాక్షన్ లో భాగంగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి తద్వారా ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపరిచేందుకు కూడా ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం . బస్సు యాత్రపై పూర్తి వివరాలు, రూట్ మ్యాప్ తదితర అంశాలు పార్టీ వర్గాల ద్వారా రేపు వెల్లడిస్తారని తెలుస్తుంది