పవన్ కళ్యాణ్పై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ఫైరయ్యారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ సభలో జనసేనాని తీరును సీఎం ఎండగట్టారు. తాజాగా బుధవారం వైఎస్సాన్ పెన్షన్ కానుక పెంపు సందర్భంగా కాకినాడలో జరిగిన సభలో దత్తపుత్రుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ పవన్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇళ్ల పట్టాలు, నిర్మాణంపై ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేస్తోందని, భూ సేకరణ పేరిట రూ.32,141 కోట్లు దుర్వినియోగం చేశారని ఐదు పేజీల లేఖలో పేర్కొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూ సేకరణలో కీలకంగా వ్యవహరించారని, గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సైతం లబ్ధిదారులకు పూర్తిగా ఇవ్వలేదని, వీటన్నింటిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తూ దత్తపుత్రుడు లేఖ రాయగా కాకినాడ సభలో సీఎం జగన్ తనదైనశైలిలో విమర్శలు చేశారు.
‘దత్తపుత్రుడు, ఆ దత్తతండ్రి కలిసి 2014 ఎన్నికలప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి పేదవాడికీ 3 సెంట్ల స్థలం, ఇళ్లు కట్టిస్తామని వాగ్దానం చేశారు. చివరికి ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పాపానపోలేదు. ఆనాడు చంద్రబాబు అక్కచెల్లెమ్మలను, పేదవాళ్లను మోసం చేస్తే దత్తపుత్రుడు ప్రశ్నించలేదు. కేంద్రానికి ఒక లేఖ కూడా రాయలేదు. ఇవాళ మీ బిడ్డ 31 లక్షల ఇళ్ల పట్టాలను నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చి 22 లక్షల ఇళ్లు కడుతుంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు. పేదలకు కట్టే ఇళ్లలో, ఇంటి స్థలాల్లో అవినీతి జరిగిందంటాడు. ఆ ఇళ్లు కట్టే కార్యక్రమం ఆపించాలని దిక్కుమాలిన ఆలోచన చేసింది వీళ్లే.
బాబు అవినీతిపరుడని సాక్షాత్తూ ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఈడీ సమన్లు ఇచ్చాయి. కోర్టులు కూడా నిర్ధారించి పరిగణనలోకి తీసుకుని జైల్లో పెట్టాయి. దత్తపుత్రుడు జైలుకు వెళ్లి దత్తతండ్రిని పరామర్శించాడు. ఇంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా ఈ పెద్దమనిషి చాలా మంచోడని సర్టిఫికెట్ ఇస్తాడు. అక్కడేమో అవినీతి జరిగినా మాట్లాడడు. మన ప్రభుత్వం విషయానికొస్తే అవినీతి జరగక పోయినా అభాండాలు వేస్తాడు. చంద్రబాబు అవినీతి చేసినా ఈ పెద్దమనిషి నోరెందుకు మెదపడంటే అందులో ఈయన కూడా పార్టనర్ కాబట్టి. పవన్ క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలించకుండా టీడీపీ కార్యాలయం నుంచి వచ్చే లేఖలను పంపి అభాసుపాలవుతున్నారని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతోందని పవన్ శైలిని తూర్పారబట్టారు సీఎం జగన్