వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో శనివారం వైఎస్సార్సీపీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. ఎప్పుడూ చూడని విధంగా దేవుడి దయతో సామాజిక న్యాయాన్ని చేతల్లో కూడా చేసి చూపించాం. ఈ విషయాన్ని చెప్పడానికి సంతోషపడుతున్నాను.
50 శాతం పదవులు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు కచ్చితంగా అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేశాం. దానిని స్ఫూర్తిగా తీసుకునిటూ ఈరోజు 200 అసెంబ్లీ, ఎంపీ స్థానాల్లో 100 స్థానాలను నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు అవకాశం ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని ఘట్టం.
ఈరోజు ఏకంగా 59 స్థానాలు బీసీలకే కేటాయించాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గానూ 11 స్థానాలు వారికే ఇవ్వడం జరిగింది. మహిళలకు ఇంతకు ముందుకన్నా బెటర్గా చేశాం. అయితే ఇది కూడా నాకు సంతృప్తిని కలిగించడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి ఇంకా వేగంగా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తున్నాం. లాస్ట్ టైమ్ కన్నా బెటర్గా చేశాం. బహుశా ఏ ఇతర పార్టీ ఇంతకన్నా బాగా చేయలేదు అనుకుంటున్నా. గతసారి 19 ఇస్తే ఈసారి 24 దాకా తీసుకుపోగలిగాం. ఇది కూడా ఒక విశేషం అనే చెప్పాలి. కానీ వచ్చే ఎన్నికల్లో ఇంకా పెద్ద సంఖ్యలో సీట్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.
ఇవాళ విడుదల చేసిన 200 మందిలో ఏకంగా 77 శాతం మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు.. గ్రాడ్యుయేట్లు, ఆపై చదువులు చదివిన వారే. ఎమ్మెల్యేలకు సంబంధించి 175 మందికి గానూ 75 శాతం గ్రాడ్యుయేట్లు, ఆపై ఉన్నత విద్యనభ్యసించిన వారిని ఎంపిక చేయగలిగాం. మైనార్టీలకు ఇంతకు ముందు 5 స్థానాలిస్తే ఇవాళ 7 స్థానాలకు పెంచగలిగాం. ఈ ఎన్నికల్లో దాదాపు 81 స్థానాల్లో ఎమ్మెల్యేలు, 18 ఎంపీ స్థానాల్లో మార్పు జరిగింది. దాదాపుగా 50 శాతం స్థానాల్లో మార్పులు చేశాం. ఇది కూడా చరిత్రలో నిలిచిపోయే ఘట్టమే. ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం ఎవరికీ ఉండకపోవచ్చేమో. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమైంది. ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి సంతోషపడుతున్నాను.
మారిన వారికి, టికెట్ రాని వారికి మనస్ఫూర్తిగా చెబుతున్నాను. రాబోయే రోజుల్లో దేవుడి దయతో, ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సముచిత స్థానం ఇస్తూ ఏదో ఒక రూపంలో దగ్గరకు తీసుకునే కార్యక్రమం కచ్చితంగా జరుగుతుందని భరోసా ఇస్తున్నాను. కనీవినీ ఎరుగని విప్లవాత్మక మార్పులతో ఈ 5 సంవత్సరాల పాలన జరిగింది. రూ.2.70 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో వేశాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు అందించాం. రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడూ చూడలేదు.
లంచాలు లేకుండా ఇవ్వడం సాధ్యమేనా? వివక్ష లేకుండా ఇవ్వగలుగుతారా? అనే పరిస్థితి నుంచి కాదు.. ఇది సాధ్యమే అని చేసి చూపించాం. 5 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడూ చూడని విధంగా సచివాలయాలు, 50 – 60 ఇళ్లకు వలంటీర్ వ్యవస్థ తీసుకుని రావడం, వీటన్నిటి ద్వారా పారదర్శకత, లంచాలు లేని, వివక్షకు చోటు లేని వ్యవస్థ ద్వారా నగదును అందించడం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయంగా గుర్తుండిపోతుంది. ఈ ఒక్కటే కాకుండా గ్రామాలు మారాయి. అక్కడి పరిస్థితులు మారాయి, స్కూళ్లు, ఆస్పత్రులు బాగుపడ్డాయి. ఎప్పుడూ జరగని విధంగా వ్యవసాయం బాగుపడింది. ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగింది. సామాజిక న్యాయం అన్నది మాటలకు కాదు..మొట్టమొదటిసారిగా సాధ్యమే అని చేసి చూపించిన ప్రభుత్వంగా ఈరోజు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలబడిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈ మార్పులవల్ల దేవుడి ఆశీస్సులతో 2 – 3 నెలల్లో కచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాను. ఈ సందర్భంగా సామాజిక న్యాయాన్ని ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకెళ్లేందుకు అడుగులు వేస్తా.