ప్రజారోగ్యానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, కంటి వెలుగు తదితర కార్యక్రమాలు ప్రవేశపెట్టి పేదలకు వైద్యం చేయిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ప్రధానాస్పత్రుల్లో రూ.కోట్లతో సౌకర్యాలు కల్పిస్తున్నారు. అందులో భాగంగా అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు కార్పొరేట్ ఆస్పత్రుల కంటే ధీటైన వైద్యసేవలు ఉచితంగా అందించేలా ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా నియోనేటల్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లు (ఎన్ఐసీయూ) మంజూరు చేశారు. గతంలో ఉన్న ఎన్ఐసీయూకు అదనంగా మరొకటి నిర్మాణం చేశారు.
పసికందులను కాపాడేందుకు గుంటూరు జీజీహెచ్లో రూ.2 కోట్లతో ఎన్ఐసీయూ కట్టారు. అత్యాధునిక వైద్య పరికరాలు, వైద్యులు, వైద్య సిబ్బందిని సైతం ప్రభుత్వం మంజూరు చేసింది.
గతంలో జీజీహెచ్లో పసికందులకు చికిత్స అందించే ఎన్ఐసీయూ వైద్య విభాగంలో 40 పడకలు ఉన్నాయి. వీటికి అదనంగా ప్రభుత్వం మరో 20 పడకలు మంజూరు చేసింది. పసికందుల ప్రాణాలు రక్షించేందుకు అవసరమైన రూ.69,25,576 విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను ప్రభుత్వం అందజేసింది. 28 మంది స్టాఫ్ నర్సులను, నలుగురు డాక్టర్లను సైతం నియమించింది. గతంలో పిల్లల వైద్య విభాగంలో ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టులను భర్తీ చేశారు. ఒక వైద్య విభాగాధిపతి, ఇద్దరు ప్రొఫెసర్లు, ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లు, తొమ్మిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 12 మంది పీజీ వైద్యులు పిల్లల వైద్య విభాగంలో నిత్యం అందుబాటులో ఉండి పసికందులకు వైద్యసేవలు అందిస్తున్నారు.
కొంత మంది పిల్లలకు పుట్టగానే కామెర్లు వస్తాయి. వీరిని ఫొటోథెరపీ యూనిట్లో ఉంచి చికిత్స చేయాలి. ఇందుకోసం 15 పరికరాలను ప్రభుత్వం నూతనంగా ఇచ్చింది. వెచ్చదనం అందించే వార్మర్లు 60, సీ ప్యాప్ మెషీన్లు 12, వెంటిలేటర్లు 12 అందించింది. ప్రతి పడకకు ఒక పల్స్ ఆక్సిమీటర్, 20 సిరంజ్ పంప్స్, డబుల్ సర్ఫేస్ ఫొటోథెరఫీ యూనిట్లు 10, లెరంజోస్కోప్ సెట్లు 10, సెక్షన్ ఆపరేటర్లు 4, ఇతర పరికరాలను అందజేసింది. రూ.లక్షలు ఖరీదు చేసే వైద్యం పసికందులకు ఉచితంగా అందుతోంది.
నాడు చంద్రబాబు ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారు. రోగులు అప్పులు చేసి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఇబ్బంది పడిన సంఘటనలు అనేకం చూశాం. నేడు జగన్ ప్రతి ప్రాణాన్ని కాపాడేందుకు నిధులు వెచ్చిస్తున్నారు. శిశువులు ఆరోగ్యంగా ఉండి భావిభారత పౌరులుగా మారేందుకు తన వంతు కృషి చేస్తున్నారు.