వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం ప్రజలే. పొత్తు వారితోనే.. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని డిసైడ్ అయిపోయారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద డిజిటల్ బోర్డు ఏర్పాటు చేశారు. జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి 73 రోజుల సమయం ఉందంటూ కౌంట్ డౌన్ బోర్డు పెట్టారు. ఇది అందరినీ ఆకట్టుకుంటోంది. 2019 ఎన్నికల సమయంలో బైబై బాబు టైం బోర్డులు పెట్టిన విషయం తెలిసిందే.
ఎన్నికల యుద్ధంలో జగన్ దూసుకెళ్తున్నారు. భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభలతో రాష్ట్రం మొత్తాన్ని ఊపేశారు. లక్షలా మంది తరలివెళ్లి ఆయన ప్రసంగాన్ని విన్నారంటే ఆ సభలకు ఉన్న క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రతిపక్షాలు ఇంకా సీట్ల తర్జనభర్జనలోనే ఉన్నాయి. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒంటరిగా బరిలో దిగలేక జనసేన, భారతీయ జనతా పార్టీలతో కూటమి కట్టారు. ఎవరు ఎక్కిడి నుంచి పోటీ చేయాలో పూర్తిగా తేలలేదు. త్యాగాల సీజన్ నడుస్తోంది. సేనకే సీట్లకే ఎసరు పెట్టారు. ఈ గందరగోళం తెగాలంటే ఇంకా సమయం పడుతుంది. ఈ లోగా జగన్ సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నారు. ఇతర పార్టీలు వాటిని అర్థం చేసుకునే లోపే కొత్త వాటిని తెరపైకి తెస్తున్నారు.
సిద్ధం సభల ద్వారా ఇప్పటికే తాను చేసిన మంచిని వివరించారు. ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు అన్నారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఇటీవలే బీజేపీ – జనసేన – టీడీపీ కూటమి కట్టాయి. ఆ తర్వాత మేదరమెట్ల సిద్ధం సభ జరిగింది. ఇందులో అందరూ జగన్ మేనిఫెస్టో విడుదల చేస్తారని భావించారు. కానీ ఆయన అనూహ్యంగా 2014 నాటి ప్రతిపక్ష కూటమి మేనిఫెస్టో తెచ్చి షాక్ ఇచ్చారు. దానిని చూపించి ఇవన్నీ అమలు చేయకుండానే మళ్లీ మోసం చేయడానికి వస్తున్నారని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు. ఈ విషయం జనంలోకి బాగా చొచ్చుకుని వెళ్లింది. దీంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి దిక్కుతోచని స్థితికి వెళ్లిపోయారు.
పైకి వాళ్లంతా కూటమి కట్టినా ఒకరిపై ఒకరికి ఏ మాత్రం నమ్మకం లేదు. చంద్రబాబు అవసరం కోసం ఎంతకైనా తెగిస్తాడని బీజేపీ పెద్దలకు తెలుసు. మమ్మల్ని తొక్కేస్తున్నాడని జనసేన కార్యకర్తలకు ఐడియా ఉంది. దీనిని బట్టి ఆ కూటమి హిట్ అయ్యే అవకాశాలు లేవు. 2009లో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఢీకొనేందుకు బాబు చాలా ఎత్తులు వేశారు. కానీ మహానేత ముందు అవన్నీ చిత్తయ్యాయి. ఈసారి ఆయన తనయుడి చేతిలో నారా వారు దెబ్బతినడం ఖాయం. అందుకే ఎంతో ధైర్యంగా జగన్ మళ్లీ ప్రమాణ స్వీకారానికి ఎంత సమయం ఉందో తెలిపే టైం బోర్డును పెట్టారు.