ప్రజలను మోసం చేయడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్ని మాయమాటలైనా చెబుతారు. ఎలాగూ చేయను కదా అని నోటికొచ్చింది అనేస్తారు. కుప్పంలో సోమవారం బాబు పర్యటించారు. ఈ సందర్భంగా రూ.4 వేల పింఛన్ను మీ ఇంటికే తెచ్చిస్తామని ప్రకటించారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన వెలగబెట్టిన పనులు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
2014 నుంచి 19 వరకు చంద్రబాబు హయాంలో పింఛన్ల కోసం లబ్ధిదారులు పడిన కష్టాలు వర్ణనాతీతం. 2019 సార్వత్రిక ఎన్నికలకు నాలుగు నెలల ముందు వరకు పింఛన్దారులకు నెలకు రూ.1,000 చొప్పున పంపిణీ చేసేవారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న సమయంలో అవ్వాతాతల ఇబ్బందులను చూసి చలించిపోయారు. వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పింఛన్లను రూ.3 వేల వరకు పెంచుతానని ప్రకటించారు. దీంతో కంగుతిన్న అప్పటి సీఎం చంద్రబాబు హడావుడిగా ఎన్నికలకు నాలుగు నెలల ముందు పింఛన్ నగదును రూ.2 వేలకు పెంచారు. అయితే బాబు మాటలను ఎవరూ నమ్మలేదు. ఎందుకంటే నాడు కొత్తవి మంజూరు కావాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిందే. ఎవరైనా చనిపోతే తప్ప కొత్త వారికి అవకాశం వచ్చేది కాదు. ఇచ్చే తక్కువ మొత్తం కోసం నాలుగైదు రోజులు అధికారుల చుట్టూ తిరిగాల్సి వచ్చేది.
వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రూ.2 వేలు ఉన్న పింఛన్ను రూ.250 పెంచి రూ.2,250 చేసి వైఎస్సార్ పింఛన్ కానుక ఫైల్పై తొలి సంతకం చేశారు. అప్పటి నుంచి ఏటా రూ.250 చొప్పున పెంచుతూ వెళ్లారు. ఈ జనవరి నుంచి రూ.3 వేలు అందిస్తున్నారు. ఇప్పుటికే దివ్యాంగులకు రూ.3 వేలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.5 వేల చొప్పున పింఛన్ నగదు అందజేస్తూ ప్రభుత్వం మానవత్వాన్ని చాటుకుంటోంది. ప్రతి నెలా ఒకటి నుంచి 5వ తేదీ వరకు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి నగదు అందజేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటళ్లలో ఉంటే అక్కడికి వెళ్లి డబ్బు చేతిలో పెడుతున్నారు.
బాబు, జగన్ పాలనలో పింఛన్ల పంపిణీలో చాలా వ్యత్యాసం ఉంది. అదే వలంటీర్లను టీడీపీ అధినేత తిడుతూ వచ్చారు. ఇప్పుడేమో నెలకు రూ.4 వేలు నేరుగా ఇంటికే తెచ్చిస్తామని చెబుతున్నారు. మీ మాటలు ఎలా నమ్మాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. అవ్వాతాతలు గౌరవంగా జీవనం సాగించేందుకు పింఛన్ సొమ్ము ఆసరాగా నిలుస్తోంది. దీని బాబు మోసం చేసే అవకాశాలు అధికంగానే ఉన్నాయి. చరిత్ర చూస్తే ఇదే చెబుతోంది. 14లో బాబు అధికారంలోకి వచ్చాక లబ్ధిదారుల సంఖ్యను బాగా తగ్గించారు. ఈసారి ఆయన్ను నమ్మితే అదే జరుగుతుంది. జగన్ సచివాలయాల ద్వారా చాలా సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అధికారులు అన్ని అర్హతలు పరిశీలించి ఎవరి ప్రమేయం లేకుండా మంజూరు చేసేస్తున్నారు. ఇంతటి అవకాశాన్ని కాదని బాబు మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు.