కాపు సామాజికవర్గంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ద్వేషం ఎక్కువ. వారిని ఎప్పుడూ ఓటు బ్యాంకుకు గానే చూశాడు. మంచి చేయాలని ఆలోచించలేదు. ఈ జగమెరిగిన సత్యం. రిజర్వేషన్లపై బాబు మోసం చేశాడంటూ కాపు ఐక్యవేదిక, కాపు నాడు, కాపు జేఏసీలు తాజాగా సంయుక్తంగా బహిరంగ లేఖ విడుదల చేశాయి. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే కాపులకు బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తానని 2014లో బాబు హామీ ఇచ్చి నయవంచనకు పాల్పడ్డాడని ఐదుపేజీల లేఖలో ఆ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్య, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ అంశాల్లో కొన్ని వర్గాలు ముందుకెళితే.. మరికొన్ని వెనక్కి నెట్టివేయబడుతున్నాయని చెప్పారు. ఉద్యమం ఫలితంగా 1994 సంవత్సరంలో ఇచ్చిన జీఓ నంబర్ 30 ద్వారా కాపులకు బీసీ రిజర్వేషన్లను ఏపీ హైకోర్టు సమర్థించింది. బాబు ఆ జీఓను కోల్డ్స్టోరేజీలో పడేశారన్నారు. జీఓలో ప్రస్తావించిన 14 కులాల్లో కాపులు మినహా మిగిలిన వారందరికీ దశల వారీగా బీసీ రిజర్వేషన్లు అమలయ్యాయని తెలిపారు. అయితే కాపులకు జరిగిన అన్యాయంపై టీడీపీ అధినేత ఏనాడు స్పందించలేదన్నారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, బిహార్ల మాదిరిగా కాపులకు రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉన్నా బాబు పట్టించుకోలేదన్నారు. 2014 మేనిఫెస్టోలో పెట్టి మరీ మోసం చేశారని తెలిపారు. కేంద్రం కల్పించిన ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్లలో కాపులకు ఐదు శాతం సబ్ కోటా అని బాబు కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చి ఈ రాష్ట్రంలో కాపులు బీసీలా, ఓసీలా అని తెలియని అయోమయస్థితి కల్పించారన్నారు. ఫైల్ను ఢిల్లీకి పంపేసి చేతులు దులుపుకొన్నారని చెప్పారు. కాపులకు ఇంత అన్యాయం చేసినా.. పవన్ కళ్యాణ్ మాత్రం బాబుకే సపోర్టు ఇచ్చి పొత్తులో ఉండటాన్ని ఆ సామాజిక వర్గ యువత జీర్ణించుకోలేకపోతోంది.
రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ కోటా విషయంలో మోసం చేసిన చంద్రబాబు గతంలో కాపు సామాజికవర్గం నేతలతో అనుచితంగా వ్యవహరించాడు. ముఖ్యంగా ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను బాబు, ఆయన తనయుడు లోకేశ్ తీవ్రంగా అవమానించిన ఘటనను ఎవరూ మర్చిపోలేదు. 2019లో కాపులు బాబును తిరస్కరించారు. దీంతో 2024 ఎన్నికల్లో వారి ఓటు బ్యాంక్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకు ఆయనకు ముద్రగడే అవసరమయ్యాడు. రాయబారానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను వాడుకుంటున్నాడు. ఇప్పటికే సేనాని తన దూతలను పంపి పలు దఫాలు చర్చించగా ముద్రగడ నిర్ణయం వెల్లడించలేదు. కుర్చీ కోసం టీడీపీ అధినేత ఎంతకైనా దిగజారుతాడు. లెక్కలేనన్ని అబద్ధాలు చెబుతాడు. 2014లో కాపులను వాడుకుని కరివేపాకుల్లా తీసి పారేశాడు. 2019లో వాళ్లు ఓడించే సరికి 2024 ఎన్నికల్లో మళ్లీ కాపుల రాగం అందుకున్నాడు. ఈ నేపథ్యంలో తమను మోసం చేశాడని ఆ సామాజిక వర్గాలకు చెందిన సంఘాలు లేఖ విడుదల చేశాయి. కాపు సంక్షేమసేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామజోగయ్య కూడా బాబును నమ్మొద్దని పవన్కు సూచనలు ఇస్తున్నారు. మొత్తానికి కాపులు బాబుపై ఆగ్రహంతో ఉన్నారని మరోసారి రుజువైంది.