యూటర్న్లు తీసుకోవడం, కపటప్రేమ చూపించడంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి తర్వాతే ఎవరైనా.. ప్రతి అంశంపై ఆయన రెండు నాల్కల ధోరణిని కలిగి ఉంటాడు. స్వార్థం కోసం మాటలు మార్చడంలో దిట్ట. వలంటీర్ల విషయంలో ఇదే జరిగింది. గతంలో వారిపై నోరు పారేసుకుని నేడు ఓట్ల కోసం రకరకాల వేషాలు వేస్తున్నాడు.
పేదలకు పక్కాగా సంక్షేమ పథకాలు చేరడానికి, వృద్ధులు, దివ్యాంగులు తదితరులకు ఇంటి వద్దే సామాజిక పింఛన్లు అందజేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ల వ్యవస్థను తెచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మొదటి నుంచి ఎల్లో గ్యాంగ్ తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉంది. చంద్రబాబైతే వారిని గోనెసంచులు మోసుకునే ఉద్యోగమన్నాడు. ఇళ్లలో మగాళ్లు లేనప్పుడు వెళ్లి తలుపులు కొడుతున్నారని, వారికి ఆ అధికారం ఎవరిచ్చారని దారుణంగా మాట్లాడారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారని అభాండాలు వేశారు. తాము అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను రద్దు చేస్తామని ప్రకటించారు. బాబు పార్ట్నర్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే వలంటీర్లను సంఘ విద్రోహ శక్తులుగా చూపించే ప్రయత్నం చేశారు.
ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి చంద్రబాబు స్వరం మారిపోయింది. ఓ వైపు వారిపై ఎల్లో మీడియాలో అబద్ధాలు రాయిస్తూనే మరోవైపు తాను అండగా ఉంటానని చెబుతూ వచ్చారు. వారిపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారు. తాము గెలిస్తే కొనసాగిస్తాని ఎన్నికల సభల్లో చెబుతూ వస్తున్నారు. వలంటీర్లను ఎన్నికల విధులకు దూరం పెట్టించాలని, వారి ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలకు అందకుండా చేయాలని టీడీపీ నాయకులే కుట్రలు పన్నారు. బాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయించారు. ఇకపోతే రాజమహేంద్రవరం సిటీ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు అయితే వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకుండా ఆపింది మేమేనని ప్రకటించారు.
చేయాల్సిన పనులన్నీ చేసేసి ఇప్పుడు చంద్రబాబు వలంటీర్ల ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే రూ.10 వేలు పారితోషికం ఇస్తామని ఉగాది నాడు ప్రకటించారు. ఇటీవలే రూ.50 వేల వరకు సంపాదించుకునేలా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇప్పిస్తానని చెప్పాడు. ఇంతలోనే మళ్లీ పదివేల రూపాయలకు వచ్చేశాడు. అండగా ఉంటామని చెబుతూనే జగన్ వైపు ఉంటే కేసులు నమోదు చేయించి ఏ ఉద్యోగాలు పొందకుండా చేస్తానని బెదిరించారు. బాబు వైపు ఉంటే మంచివాళ్లు.. జగన్ వైపు ఉంటే చెడ్డవాళ్లనే విధంగా చూపించే యత్నం చేశారు. మచ్చిక చేసుకోవాలని చూస్తూనే.. మీరు నా మాట వినకపోతే కేసుల్లో ఇరికిస్తానని భయపెడుతున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రి రాజకీయం ఇది. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా వలంటీర్లను అడ్డుకుని.. ఇప్పుడు ఎన్నికల్లో వారి ఓట్ల కోసం అది చేస్తా.. ఇది చేస్తానని చెబుతున్నాడు. అందుకే సేవా సైనికులందరూ నిన్ను నమ్మం బాబూ అంటున్నారు.