గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నారు. కమ్యూనిస్ట్ సానుభూతిపరుల కుటుంబం నుంచి వచ్చారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. గోదావరి జిల్లాల్లో పార్టీ బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీకి సంబంధించి అనేక కీలక పదవుల్లో పనిచేశారు. వాస్తవానికి ఈయనకున్న అనుభవానికి.. ప్రస్తుతం ఉన్న స్థితికి పొంతనే ఉండదు. బుచ్చయ్య తర్వాత వచ్చిన నేతలు అందలమెక్కగా ఈయన మాత్రం చంద్రబాబు దృష్టిలో ఎప్పుడూ కరివేపాకే..
గోరంట్ల అప్పట్లో ఎన్టీఆర్కు అనుకూల వర్గంలో ఉన్నారు. ఆయన మంత్రి వర్గంలో కొంతకాలం పనిచేశారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచే సమయంలో రామారావు వైపే నిలిచారు. తర్వాతి కాలంలో ఎన్టీఆర్ టీడీపీ తరఫున రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1997లో తిరిగి తెలుగుదేశంలో చేరారు. అయితే ఆయనకు బాబు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. తనదైనశైలి మాటలతోనే బుచ్చయ్య ఎదిగారు. 2014లో రాజమండ్రి రూరల్ నుంచి గెలిచారు. మంత్రివర్గంలో స్థానం ఆశించారు. అయితే అది అందని ద్రాక్షే అయింది. అందర్ని వాడుకుని వదిలేసే బాబు ఈయన విషయంలోనూ అలాగే చేశారు. 2019 జగన్ తుఫాన్లోనూ బుచ్చయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ చంద్రబాబు దృష్టిలో సున్నాగానే ఉండిపోయారు.
మొదటి నుంచి..
చంద్రబాబు టీడీపీలో చేరిన బుచ్చయ్య చౌదరికి మొదటి నుంచి అవమానాలే ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సీనియర్ నాయకుడు పదవులు ఆశించినా ఇవ్వకుండా అవమానపరిచారు. 2021లో బాబు వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేయగా బుజ్జగింపుల పర్వం కొనసాగింది. గతంలోనూ పార్టీ వీడేందుకు ప్రయత్నించగా ఏవో మాటలు చెప్పి ఆపారు. ముక్కుసూటి మనిషిగా పేరున్న బుచ్చయ్య పార్టీలో లోపాలను ఎప్పటికప్పుడు సునిశితంగా ఎత్తి చూపుతుంటారు. దీంతో ఆయన్ను అధిష్టానం దూరం పెడుతూ ఉంటుంది. చౌదరి సోషల్ మీడియా వేదికగా తన పార్టీపై తన అభిప్రాయాలను స్వేచ్ఛగా చెబుతుంటారు. గతంలో నారా లోకేశ్ను విమర్శించిన సందర్భాలున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రావాలని గట్టిగా చెప్పారు. దీంతో ఆయనపై బాబు, లోకేశ్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ వచ్చారు.
టికెట్ డౌటే..
అత్యంత సీనియర్ ఎమ్మెల్యేకు ఈసారి టీడీపీ టికెట్ నిరాకరించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పొత్తులో భాగంగా జనసేన నాయకుడు కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం రూరల్ నుంచి తానే పోటీ చేస్తున్నట్లు విలేకరుల సమావేశాలు పెట్టి మరీ ప్రకటించారు. ఇరు పార్టీల పెద్దల ఆశీస్సులు తనకే ఉన్నాయంటున్నారు. బుచ్చయ్య మాత్రం తానే పోటీ చేస్తానంటూ చెబుతున్నారు. టికెట్ వ్యవహారం ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఇదిలా ఉండగా సొంత పార్టీ గోరంట్లకు అండగా నిలిచే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఆనాడు ఎన్టీఆర్కు అనుకూలంగా వ్యవహరించిన బుచ్చయ్యపై బాబుకు చాలా కోపం ఉందని, అందుకే ఆయన్ను దూరం పెట్టొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చౌదరి రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే అయినా మనసంతా సిటీపైనే ఉండేది. పార్టీలో సీనియర్ అయిన తనను కాదని ఇతరులను ప్రోత్సహిస్తున్నారని కేడర్ వద్ద బాధపడేవారు. ఆయనకు రూరల్ ఇవ్వని పక్షంలో ఆదిరెడ్డి వాసును ఎంపీ స్థానానికి పంపి సిటీ సీట్ ఇస్తారని ప్రచారం జరిగింది. బాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చాక ఆయన కుటుంబం వద్ద మార్కులు కొట్టేసేందుకు వాసు అనేక ప్రయత్నాలు చేశారు. దీంతో సిటీ సీట్ ఇయనకే అంటున్నారు. మొత్తానికి బుచ్చయ్య స్థితికి బాబు వైఖరే కారణం. సీట్ విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతోనే కేడర్ కూడా అయోమయంలో ఉంది. పాత పగ నేపథ్యంలో ‘బుచ్చయ్యా.. నీకు వయసు అయిపోయింది. నీ సీట్ను జనసేనకు ఇచ్చేస్తున్నాం.’ అని అధిష్టానం చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా నారా వారు గోరంట్ల రాజకీయ జీవితానికి విలన్గా మారారు.
–వీకే..