‘దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నా వాల్లే వచ్చింది. హైదరాబాద్లో సైబర్ టవర్స్ కట్టించి ప్రపంచ పటంలో పెట్టా. నేను కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరగడం వల్లే సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయి. రాష్ట్రంలో ఎక్కువ మంది ఇంజినీర్లు ఉండడానికి కారణం నేనే. నేను చెప్పడంతోనే ఇక్కడ పరిశ్రమలు పెట్టారు. నన్ను చూసే బిల్గేట్స్ అంతటి వ్యక్తి వచ్చాడు. మీ పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంటే అది నా పుణ్యమే’ మైక్ దొరికితే చాలు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొట్టే సెల్ఫ్ డబ్బా ఇది. నిద్ర లేచింది మొదలు అన్నింటికి నేనేనని అరిచి చెప్పే బాబు కుప్పానికి చేసింది మాత్రం శూన్యం.
చంద్రబాబు 1989 సంవత్సరం నుంచి కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఏమీ చేయలేదు. అక్కడికి వెళ్లిన ప్రతిసారీ మాటలు కోటలు దాటిస్తుంటారు. 14 సంవత్సరాలు సీఎంగా చేసినా తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఒక్క కంపెనీ కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. ఐటీ పితామహుడినని చెప్పే బాబు కుప్పంలో ఎందుకు ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనిపించలేదనే ప్రశ్న ఆ ప్రాంత యువతను చాలా కాలంగా వేధిస్తోంది. ఇప్పటికీ కుప్పం నుంచి రోజూ వేలాది మంది పొట్టకూటి కోసం కర్ణాటక, తమిళనాడుకు వెళ్తుంటారు.
కియా నా వల్లే వచ్చింది.. ప్రపంచస్థాయి రాజధాని అమరావతి నా సృష్టే అనే నారా వారు కుప్పాన్ని కనీసం రెవెన్యూ డివిజన్ కూడా చేయలేకపోయారన్నది నిజం. మరోసారి అక్కడి నుంచే పోటీకి సిద్ధమయ్యారు. అయితే గెలుపుపై నమ్మకం లేక పదేపదే వెళ్తున్నారు. ఇప్పటికే భువనేశ్వరి ఒకసారి వెళ్లి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామని ఎలాగైనా బాబును గెలిపించాలని నేతలు, కార్యకర్తలను ప్రాధేయపడ్డారంటే పరిస్థితులు ఎంతలా మారిపోయాయో అర్థం చేసుకోవచ్చు.
సోమవారం కుప్పం వెళ్లిన బాబు టీడీపీ అధికారంలోకి రాగానే ఈ నియోజకవర్గాన్ని బెంగళూరుతో అనుసంధానం చేస్తానని ప్రకటించారు. సజ్జపురం నుంచి కుప్పం వరకు నాలుగులేన్ల రోడ్డు నిర్మించి గంటలోనే బెంగళూరుకు వెళ్లేలా చేస్తానని, తనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పారు.
బెంగళూరుతో అనుసంధానిస్తా. అక్కడికే వెళ్లి పనిచేసుకోండనే ధోరణిలో చంద్రబాబు మాటలున్నాయి. వలసలు నివారించేందుకు చర్యలు తీసుకుంటా.. నా పలుకుబడి ఉపయోగించి పరిశ్రమలు తెస్తా.. యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని ఆయన చెప్పలేకపోతున్నారు. ఎంత సేపటికీ వారిని మభ్యపెట్టాలనే చూస్తున్నారు. కొంతకాలం క్రితం వెళ్లిన నారా వారు కుప్పం కూరగాయలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తానని చెప్పారు. వాటిని విమానాల్లో పంపి అమ్మిస్తానని బిల్డప్ ఇచ్చారు. 2014కు ముందు ఇక్కడ పర్యటించి బంగారు కుప్పం చేయడమే నా జీవితాశయం అన్నారు. ఎన్నికల్లో గెలిచాక ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. బాబు 89 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా జరిగిన అభివృద్ధి అంతంతమాత్రమే.
చంద్రబాబూ.. మీకు ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు తెలుసంట కదా.. ఒక్కటంటే ఒక్క భారీ పరిశ్రమ మా ఊర్లో పెట్టించవచ్చు కదా అని ఓ తెలుగు తమ్ముడు అడుగుతున్నాడు.. ఏదో ఒకటి చెప్పండి..