‘రాష్ట్ర ప్రజలు ఓపికగా ఉండి ఎక్కువ మంది పిల్లల్ని కంటే బాగా లాభపడతారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఒక ఆడపిల్ల ఉంటే నెలకు రూ.1,500, ఇద్దరు ఉంటే రూ.3,000, ముగ్గురు ఉంటే రూ.4,500.. అలాగే ఒక్కో పిల్లవానికి చదువు కోసం ఏడాదికి రూ.15,000 చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. ఎక్కువ మంది పిల్లలను కంటే టీడీపీ హయాంలో అంత లాభం’ ఈ చెత్త మాటలు చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు. సోమవారం శ్రీకాకుళంలో జరిగిన రా కదలిరా సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. బాబు తనని దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడినని, 40 ఇయర్స్ ఇండస్ట్రి అని, ప్రపంచ మేధావినని, పెద్ద విజనరీనని చెప్పుకొంటుంటారు. జనాభా పెరుగుదల వల్ల ఎన్ని నష్టాలుంటాయో ఆయనకు తెలియంది కాదు. కాకపోతే ఓట్ల కోసం అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు.
ప్రపంచ జనాభా ఐదు బిలియన్లు దాటిన సమయంలో.. పెరుగుదలను కట్టడి చేయడానికి, దీనిపై అవగాహన పెంచడానికి.. 1987లో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పాకలమండలి నిర్ణయం మేరకు ప్రతి ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
జనాభా పెరిగితే అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఆహార భద్రత ఉండదు. పట్టణీకరణకు దారి తీస్తుంది. లింగ సమానత్వం దెబ్బ తింటుంది. నిరుద్యోగం సరేసరి. ప్రజారోగ్యం, శ్రేయస్సుపై గణనీయమైన ప్రభావం పడుతుంది. అందరికీ నాణ్యమైన విద్య అందించడం చాలా కష్టం. నీటి సమస్యలు వస్తాయి. సహజ వనరుల వినియోగం పెరిగిపోతుంది. పర్యావరణ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. పేదరికం అధికమవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి. అందువల్ల జనాభా కట్టడికి ప్రతి ఏడాది జూలై 11వ తేదీన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. నష్టాలు, కుటుంబ నియంత్రణ, మహిళా సాధికారిత గురించి వివరిస్తుంటారు. వనరుల సంరక్షించి భావితరాలకు అందించాలని ప్రతిజ్ఞలు చేస్తుంటారు. వాడవాడలా ర్యాలీలు, ప్రధాన కూడళ్లలో మానవహారాలు జరుగుతుంటాయి. ప్రభుత్వ అధికారులు ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు చేస్తారు.
జనాభా నియంత్రణ పాటించాలి.. ముగ్గురు, నలుగురు పిల్లలు వద్దు.. ఒకరిద్దరే ముద్దంటూ ప్రభుత్వాలు నినాదాలు ఇస్తుంటాయి. కానీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు మాత్రం జనాభా పెంచాలని ప్రతి ఎన్నికల సభలో ఊదరగొడుతున్నారు. నాకు ఓటేస్తే మీకు డబ్బులొస్తాయని ప్రజల్ని ప్రలోభ పెడుతున్నారు. ఇలా చేయడం చాలా తప్పని తెలిసినా స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఆయన పాలనలోనే జనాభా నియంత్రణపై ర్యాలీలు, కార్యక్రమాలు జరిగాయి. ఇవన్నీ మర్చిపోయి రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొట్టడాన్ని మేధావులు ఖండిస్తున్నారు. వాస్తవానికి ఇచ్చిన హామీలు నెరవేర్చే అలవాటు నారా వారికి లేదు. ఓట్ల కోసం తప్పుడు వాగ్దానాలు చేస్తుండటమే కాకుండా ప్రజల్ని ప్రమాదంలో నెట్టే పనులను ప్రోత్సహిస్తున్నారు. నేను మారిన మనిషినని ఓ వైపు చెబుతూనే మరోవైపు నేను ఎప్పటికే పాత మనిషినని రుజువు చేసుకుంటుంటారు. పొరపాటున బాబు మాట విన్నారో ఇక అంతే సంగతులు..