తెలుగుదేశం ఎన్నికల నినాదాలకు.. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ చేసే పనులకు అసలు సంబంధమే ఉండదు. 2024 ఎన్నికల నేపథ్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారెంటీ అంటున్నారు. తాజాగా ఓ నినాదాన్ని బయటకు తెచ్చారు. ‘ఆపద్బాంధవుడు.. బాబు రావాలి.. బతుకులు మారాలి..’ అంటూ టీడీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
ఒకసారి గతంలోకి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు చూస్తే ఆయన ఆపద్భాంధవుడు కాదు.. దగాకోరని ఇట్టే తెలిసిపోతుంది. 2014లో ఇలాగే బాబు వస్తేనే జాబు అంటూ ఊదరగొట్టారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని అప్పటి కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీలు ప్రచారం చేశాయి. తీరా అధికారంలోకి వచ్చాక ఊరికో జాబ్ కూడా ఇవ్వలేదు. 2019లో ఎన్నికలు వచ్చే సరికి 14లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని చెప్పారు. కానీ జనం ఛీ కొట్టారు.
2024 ఎన్నికల్లో బాబు అనేక నినాదాలు తెచ్చారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను కాపీ కొట్టి టీడీపీ ఇక్కడ వాటినే ప్రచారం చేస్తోంది. దీనికి ఆపద్బాంధవుడు.. బాబు రావాలి.. బతుకులు మారాలంటూ క్యాప్షన్లు ఇస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి కాదు. ఈ విషయాన్ని రెండు దశాబ్దాల పైనుంచి జనం చూస్తూనే ఉన్నారు. నారా వారి పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా అని సిద్ధం సభల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. నిజమే కదా.. టీడీపీ అధినేత 14 సంవత్సరాలపాటు సీఎంగా చేశారు. కానీ తన మార్క్ స్కీమ్ ఒక్కటి కూడా లేదు. మరి ఆయన ఆపద్బాంధవుడు ఎలా అవుతాడు.
మోసం చేయడమే చంద్రబాబు నైజమని అందరికీ తెలుసు. కానీ ఆయన్ను గొప్ప వ్యక్తిగా చిత్రీకరించేందుకు, ఎల్లో మీడియా, సోషల్ మీడియాలోని పెయిడ్ పేజీలు నిత్యం ప్రయత్నిస్తుంటాయి. 2014 – 19 వరకు అధికారం ఇస్తే ఎందరి బతుకులు మార్చాడు?, అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయలు సంపాదించడం తప్ప రాష్ట్రానికి చేసిన మేలు ఏమైనా ఉందా.. అన్న క్యాంటీన్లు పెట్టాడు, పసుపు – కుంకుమ ఇచ్చాడు. నిరుద్యోగ భృతి అందించాడని తెలుగు తమ్ముళ్లు చెప్పొచ్చు. అవి ఎప్పుడు చేశాడన్నదే విషయం. 14 ఎన్నికల సమయంలో హామీలిచ్చి.. 19 ఎన్నికలకు కొద్దిరోజుల ముందే కదా హడావుడిగా పథకాలను ప్రారంభించాడు. అంటే ఎలక్షన్ స్టంట్ అనే కదా.. అలాంటి వ్యక్తిని ఆపద్బాంధవుడంటే ఎలా.
స్కిల్ డెవలప్మెంట్ పేరుతో యువతను దగా చేశాడు. రుణమాఫీ ఎగ్గొట్టి రైతుల్ని ముంచాడు. పొదుపు మహిళలకు రుణమాఫీ చేస్తానని ఆశపెట్టి చివరికి కట్టుకథలు చెప్పాడు. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా ఉన్నాయి. సమాజంలోని ప్రతి వర్గానికి అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఆయనొస్తే బతుకులు మారవు. ఇంకా నాశనమవుతాయి. టీడీపీ అధినేత ఎప్పటికీ ఆపద్బాంధవుడు కాలేడు. వారి నినాదాలను చూసి నవ్వుకుంటున్నారు తప్ప నమ్మడం లేదు.