తెలుగుదేశాన్ని ఎన్డీఏలో చేర్చుకోవడం ఆలస్యమైందనే కోపం చంద్రబాబు నాయుడికి ఉందేమో.. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని అవమానించారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే ఆయన్ను తిట్టి పోశారు. నేడు అతిథి మర్యాదలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీనిపై భారతీయ జనతా పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
ఆదివారం చిలకలూరిపేట సమీపంలో ప్రజాగళం సభ జరిగింది. దీనికి మోదీ, చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. లోకేశ్ సభ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. పీఎంను బాబు సన్మానించాలని వ్యాఖ్యాత కోరగా.. మోదీతోపాటు అందరూ లేచి నిలబడ్డారు. కానీ ఎవరూ పూలబొకే, శాలువా తీసుకురాలేదు. దీంతో వేదికపై ఉన్న వారికి ఏమీ అర్థం కాలేదు. అందరూ దిక్కులు చూశారు. పవన్ మోదీని సన్మానిస్తారని చెప్పగా అదే పరిస్థితి ఎదురైంది. కనీసం పుష్పగుచ్ఛాలు, శాలువాలు కూడా తీసుకురాలేదు. చివరికి ఏపీ బీజేపీ చీఫ్ జ్ఞాపికతో సత్కరించారు.
గతంలో బాబు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన సమయంలో నానా హంగామా చేశారు. రాష్ట్రానికి కమలం పెద్దలు వస్తుంటే నల్లచొక్కాలు వేసుకుని రచ్చ చేసిన సందర్భాలున్నాయి. అలా ఓసారి మోదీ వస్తుంటే తన మాట ప్రకారం నడిచే ప్రత్యేక హోదా సాధన సమితి ఐకాస నాయకులతో చేత ఖాళీ కుండలతో స్వాగతం చెప్పించారు. అమరావతి శంకుస్థాపన సమయంలో మోదీ పుణ్య నదుల మట్టి, నీళ్లు తెచ్చిచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఖాళీ కుండలతో స్వాగతం చెప్పాలని అప్పట్లో నిర్ణయించారు. ఈ ఘటన.. తాజాగా ప్రజాగళం ఘటనను పోల్చి బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాబు కావాలనే ఇలా చేశారని మండిపడుతున్నారు. గొప్పగా సభ నిర్వహిస్తున్నామని చెప్పారని, సాక్షాత్తు ప్రధానికి పూలబొకే ఇవ్వకుండా అవమానించారని వాపోతున్నారు.
మొదట లోకేశ్ ఏర్పాట్లు చేశారని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపించారు. తీరా ప్రధానిని అవమానించారని కాషాయ కార్యకర్తలు కోప్పడడంతో ఆ నెపాన్ని ప్రత్తిపాటి పుల్లారావుపై నెట్టేశారు. శాలువాలు లేకపోవడం, మైకులు పనిచేయకపోవడం తదితరాలకు కారణం ఆయనేనని ప్రచారం చేశారు. అయితే పుల్లారావు చాలా తెలివిగా మొత్తానికి పోలీసులే కారణమని మీడియా ముందు చెప్పి తప్పించుకున్నారు. అసలు సభ వాళ్లు పెట్టి ఏర్పాట్లు సక్రమంగా చేసుకోకుండా పోలీసుల్ని అనడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.