చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఇష్టారీతిన హామిలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలకు ఎగనామం పెడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, సవాలక్ష కొర్రీలతో ప్రజలని మోసం చేస్తాడని అందరికీ తెలిసిన విషయమే.
1995 లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన రోజు నుండి 2004 వరకూ, తిరిగి 2014 నుండి 2019 వరకు మొత్తం 14ఏళ్ళు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని తాను చెప్పిన హామీలను ఏరోజు నెరవేర్చిన పాపాన పోలేదు.
ప్రతీ ఎన్నికల ముందు మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా, మళ్ళీ అవే హామీలు ఎన్నికల ముందు ఇచ్చి ప్రజలని మోసం చేసి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాడు చంద్రబాబు. ఈ కోవలోనే మరోసారి ఎంచుకున్న హామీ నిరుద్యోగభృతి. రాబోయే ఎన్నికల్లో యువగళం పథకం కింద 20 లక్షల ఉద్యోగాలు, 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తానంటూ హామీలను చంద్రబాబు ఇస్తున్నారు. ప్రజలకి జ్ఞాపశక్తి తక్కువ అనే ధీమా కాబోలు చంద్రబాబుకి. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చి ఎగనామం పెట్టిన 600 హామీల్లో ఈ నిరుద్యోగభృతి కూడా ఒక ప్రధానమైన హామీ. నాడు చంద్రబాబు మానిఫెస్టోలో చెప్పిన మాట ఒక సారి చూస్తే ఇంటింటికి ఒక ఉద్యోగం, లేకుంటే ప్రతి నిరుద్యోగికి 2 వేలు భృతి అంటూ చెప్పి ఆ హామీని గాలికి వదిలేసిన విషయం ఇంకా ఎవరు మర్చిపోయి ఉండరు.
నిరుద్యోగ భృతి విషయంలో 2014 నుండి 2018 వరకు నాలుగున్నరేళ్లు మొద్దునిద్రలో ఉన్న చంద్రబాబు సర్కార్ 2019 ఎన్నికల నేపథ్యంలో మేలుకునట్టు నటించింది. అదీ కూడా ఇంటింటికి ఉద్యోగం…లేకుంటే ప్రతి నిరుద్యోగికి 2 వేలు భృతి అంటూ దండోరా వేసిన ప్రభుత్వం 1000కే పరిమితం చేసింది. అదీ కూడా 2018 ఆగస్టు అని ఒకసారి, కాదు అక్టోబరు 2కు అంటూ మరోసారి వాయిదాలు వేస్తూ వచ్చింది. ఎంత మారినా మళ్లీ సవాలక్ష ఆంక్షలతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు.
ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి అమలు చేసిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకంలో రాష్ట్రంలో 1.70 కోట్ల మంది నిరుద్యోగులు ఉంటే అందులో లక్షల మంది దరఖాస్తు చేస్తే రకరకాల నిబంధనల పేరుతో జన్మభూమి కమిటీలు చెప్పిన 12 లక్షల మందికే భృతి వచ్చేలా విధానాలు కల్పించి, యువతని నిండా ముంచిన చరిత్ర ఇంకా రాష్ట్ర ప్రజలు మర్చిపోయి ఉండరు. ఈ నేపథ్యంలో మళ్ళీ మరోసారి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా యువగళం పథకం కింద 20 లక్షల ఉద్యోగాలు, 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తానంటూ హామీలను ఇస్తున్నారు చంద్రబాబు.
2014 నుండి ఇచ్చిన హామీని నెరవేర్చమని యువత కోరితే మంత్రి స్థాయిలో అచ్చెన్నాయుడు నిరుద్యోగభృతి ఇవ్వలేం అని చెప్పారు , స్పీకర్ స్థానంలో కోడెల శివప్రసాద్ యువత నిరుద్యోగభృతి ఆశించకూడదు అంటూ నీతులు చెప్పారు. ఇవి ఇంకా యువత మర్చిపోలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు గుర్తించకపోవడం ఆయన ఎంత కాలం చెల్లిన రాజకీయ నాయకుడిగా మారారో అద్దం పడుతుంది.