‘అది గోనె సంచులు మోసుకునే ఉద్యోగం. ఇళ్లలో పురుషులు లేనప్పుడు వెళ్లి తలుపులు కొడుతున్నారు జగన్ను నమ్ముకుంటే జైలుకు పంపిస్తా’ వలంటీర్ల విషయంలో వివిధ సందర్భాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలివి. నిన్నమొన్నటి వరకు వారిపై దారుణంగా మాట్లాడారు. అదే ఎన్నికలు సమీపించడంతో బాబుకు గుండె నిండా ఓటమి భయం ఉంది. అందువల్ల గ్రామాల్లో కీలకంగా ఉన్న వలంటీర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
పెనుగొండ మండలంలో సోమవారం జరిగిన రా కదలి రా సభలో బాబు వలంటీర్లపై కపట ప్రేమ చూపించారు. అధికారంలోకి వస్తే వారిని తొలగించనని.. కొనసాగిస్తానని చెప్పారు. వాస్తవానికి అనేక సందర్భాల్లో టీడీపీ నాయకులు ఆ వ్యవస్థ అంతు చూస్తామని బెదరించారు. బాబుతో పొత్తులో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే దాని నడుం విరగ్గొట్టాలని ఓ సందర్భంలో అన్నారు. ఇప్పుడేమో అందరూ వారి ఓట్ల కోసం ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారు.
నారా వారికి ఇవే చివరి ఎన్నికలు కావడంతో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా రకరకాల వేషాలు వేస్తున్నారు. ఓ వైపు వలంటీర్లను తాను తిట్టడమే కాకుండా ఎల్లో మీడియాలో చెత్తగా రాయిస్తున్నారు. మరోవైపు లక్షల్లో ఉన్న వలంటీర్ల కుటుంబాల ఓట్ల కోసం నానా పాట్లు పడుతున్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు పెట్టి అరాచకాలు చేసుకోమని లైసెన్స్ ఇచ్చిన చరిత్ర చంద్రబాబుది. ఆయనకు వలంటీర్ల వ్యవస్థంటే మొదటి నుంచి చిన్నచూపు ఉంది. పైకి మాత్రం వారిని కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. కానీ చరిత్ర చూస్తే ఏనాడూ మాటపై నిలబడినట్లు కనిపించదు. ఎన్నికల సమయంలోనే అన్ని వర్గాలపై అభిమానం ఉన్నట్లు చూపుతారు. అయ్యాక నిర్లక్ష్యంగా నవ్వుతూ నేను ఎప్పుడు చెప్పానని ఎదురు ప్రశ్నిస్తారు. 40 ఇయర్స్ ఇండస్ట్రికి ఇది అలవాటే.
జగన్ సేవా సైన్యంపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. సంక్షేమ పథకాలను ఇంటి ముంగిటకు చేర్చేది వారే. ప్రతినెలా ఒకటో తేదీన లబ్ధిదారుల వద్దకు వెళ్లి పింఛన్ సొమ్ము చేతిలో పెట్టేది వారే. ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉన్న వ్యవస్థ ఇది. ఎల్లో గ్యాంగ్ వారిపై ఎంత విష ప్రచారం చేసినా నమ్మడం లేదు. దీంతో నాలుగు ఓట్లు సంపాదించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. జగన్ అయితే చాలామందిని సర్పంచ్లు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, ఎంపీపీలు చేశారు. అది ఆయన ఘనత. తమ విషయంలో పచ్చ మనుషులు వ్యవహరించిన తీరును వలంటీర్లు ఎప్పటికీ క్షమించరు.