నెల్లూరు జిల్లా కోవూరు తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కుటుంబానికి అటు చంద్రబాబు నాయుడు, ఇటు వేమిరెడ్డి ప్రభార్రెడ్డి (వీపీఆర్) వెన్నుపోటు రుచి చూపించారు. దీంతో పోలంరెడ్డి దిక్కుతోచని స్థితికి వెళ్లిపోయారు.
శ్రీనివాసులురెడ్డి 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. గతంలో ఓసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. కోవూరు సీనియర్ నేతగా ఉన్నారు. 2019లో ఓడిపోయినా పార్టీకి దూరం కాలేదు. కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో వయసు రీత్యా తన తనయుడు దినేష్రెడ్డికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరగా సరే అన్నారు. ఇన్చార్జిగా నియమించారు. ఆయన చాలాకాలంగా అధిష్టానం చెప్పిన ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో నగదు ఖర్చు చేశారు.
వీపీఆర్ టీడీపీలో చేరడంతో సమీకరణాలు మారిపోయాయి. ఆయన భార్య ప్రశాంతిరెడ్డికి నెల్లూరు సిటీ లేదా రూరల్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో సమీపంలోని కోవూరుపై కన్నేశారు. కానీ అలాంటిదేమీ లేదని కొద్దిరోజులుగా చెబూతూ వచ్చారు. ఇటీవల ఆ ప్రాంతానికి వెళ్లిన వీపీఆర్ దినేష్రెడ్డి మీ అభ్యర్థి అని, ఆయన్ను ఎమ్మెల్యేగా, తనను నెల్లూరు ఎంపీగా గెలిపించాలని కోరారు. దీంతో పోలంరెడ్డి వర్గం ఊపిరి పీల్చుకుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఇచ్చారు. వీపీఆర్ మాకు వద్దని చెబుతూనే చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. దీంతో రెండో జాబితాలో ప్రశాంతిరెడ్డిని కోవూరుకు ఖరారుకు చేశారు.
వీపీఆర్, చంద్రబాబు నమ్మించి ద్రోహం చేశారని పోలంరెడ్డి వర్గం రగిలిపోతోంది. గతంలో ఈ నియోజకవర్గంలో పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి సీటు ఇస్తామని, పార్టీకి బాగా ఖర్చు చేయించి హ్యాండ్ ఇచ్చిన చరిత్ర బాబుది. అలాంటి వ్యక్తిని నమ్మితే మోసమే చేస్తారని స్థానిక తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ప్రశాంతిరెడ్డికి టికెట్ ఇవ్వడం వారికి ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో వీపీఆర్ ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని, తమ వెంట నడవాలని నేతల్ని కోరుతున్నారు. పోలంరెడ్డి కుటుంబ రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారిపోయింది. మరోచోట అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. ఇక తండ్రీకొడుకులు ఏం చేస్తారో..