ఒక్కోసారి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిజాలు చెప్పేస్తారు. మనసులో ఉన్న మాట దాగదు. తాజా ఎన్నికల ప్రచారంలో కూడా తన పాలనలో జరిగిన అక్రమాల గురించి స్వయంగా వెల్లడించారు. ‘2014›– 19 మధ్య ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. బాదుడే బాదుడు. అవన్నీ మీరు గుర్తు చేసుకోవాలి’ అని సూచించారు. అవన్నీ తలుచుకుంటే మళ్లీ ఓటేయరని తెలిసినా చెప్పాడు.
నిజమే బాబు. టీడీపీ హయాంలో 14 నుంచి 19 వరకు ప్రజలు నరకం చూశారు. ప్రతి రంగాన్ని నిర్వీర్యం చేశారు. దోపిడీయే లక్ష్యంగా పాలన సాగింది. జన్మభూమి కమిటీల అరాచకాలు ఇంకా అందరి కళ్ల ముందు మెదులుతున్నాయి. అమరావతి రాజధాని పేరుతో చేసిన భూ కుంభకోణం ప్రతి ఒక్కరికీ గుర్తుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్నెట్ స్కాం, ఇసుక, మద్యం కుంబకోణాలు, పుష్కరాల్లో జనాన్ని చంపడం, ఎమ్మెల్యేల కొనుగోళ్లు, నిత్యావసరాల రేట్ల పెంపు, కేంద్రం ఇచ్చిన డబ్బు కొట్టేయడం, తాత్కాలిక అసెంబ్లీ పేరుతో వర్షం పడితే ఉరిసే స్థాయిలో భవనం కట్టడం.. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ఎల్లో మీడియాలో ఊదరగొట్టడం, విచ్చలవిడిగా మద్యం విక్రయాలు.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉన్నాయి. నేను బాదేశానని స్వయంగా బాబే ఒప్పుకోవడం అభినందించాల్సిన అంశం. అది కూడా పవన్ను పక్కన పెట్టుకుని.
పవన్ కళ్యాణ్ కూడా 2018, 19 సంవత్సరాల్లో చంద్రబాబు పాలనపై ఎన్నో విమర్శలు చేశారు. టీడీపీ నేతలు దోచేశారన్నారు. లోకేశ్కు మాత్రమే ఉద్యోగం వచ్చిందన్నారు. అమరావతి పేరుతో జరిగిన అవినీతిని ఎండగట్టారు. ఆయనకు అన్నీ తెలుసు కాబట్టే నారా వారు నేను బాదేశానంటున్నా.. అడ్డు చెప్పలేదు. నిజాలే కదా అని నిమ్మకుండిపోయాడు. గతంలో లోకేశ్ ఓసారి సైకిల్ గుర్తుకు ఓటేస్తే మిమ్మల్ని మీరు ఉరి వేసుకున్నట్లేనని చెప్పారు. ఒక్కోసారి తండ్రీకొడుకుల నోటి నుంచి అలా నిజాలు బయటకు వచ్చేస్తుంటాయి. ఇంకా చాలా సభలు ఉన్నాయి. మీరు చేసిన స్కాంల గురించి ఒక్కో సభలో చెప్పేయొచ్చు కదా బాబూ..
బాబు వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రజలను బాదిబాది వదిలామంటూ నిజం పలికాడు. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల కష్టాన్ని జలగల్లా పీల్చేస్తామని చెప్పకనే చెబుతున్నాడు అంటూ బాబు స్పీచ్ వీడియోను జోడించారు. ఇది వైరలైంది.