ఎన్ టీ ఆర్ ఫొటోకి పొద్దున్నే నమస్కరించి ఏదైనా పని సంకల్పిస్తే జరిగి తీరుతుందని తన విశ్వాసమని బాబు ఇటీవల ఒక మీటింగ్ లో చెప్పుకొచ్చారు చంద్రబాబు . చరిత్ర చూస్తే ఆ దేవుడి లాంటి మామ వెనక ఉన్న గాయలన్ని ఈ అల్లుడు చేసినవే కనపడతాయి . అలా ఆనాడు తనకైన గాయాల గురించి జామాత దశమగ్రహం అంటూ మామ చెప్పుకొన్న వేదన మనమూ చూద్దామా.
నిజానికి ఎన్ టీ ఆర్ కి బాబు చేసిన ద్రోహం మామూలుది కాదు. నమ్మించి గొంతు కోసే బాబు తత్వాన్ని ఎన్ టీ ఆర్ ముందే పసి గట్టలేక పోయాడు. తన తర్వాత పార్టీ పగ్గాలు అందుకోవాలనే ప్లాన్ తోనే తనకు అంత విధేయంగా ఉన్న సంగతి ఆయనకు అర్థం కాలేదు. నిజానికి ఆయనకు ఉన్న రాజకీయపు బుర్ర ఎంత? నడిపించింది మొత్తం బాబే కదా?
తోడు కోసమో, దగ్గరుండి చూసుకునే అండ కోసమో ఆయన చేసుకున్న రెండో పెళ్ళితో బాబు తీవ్రమైన భయానికి, అభద్రతకు లోనై, అస్త్రాలను బయటికి తీశాడు. రాజకీయాలలో లక్ష్మీ పార్వతి జోక్యాన్ని సహించలేక పోయాడు. ఎవరైనా సరే తనను దాటి గానీ ఎన్ టీ ఆర్ ని కలవడానికి వీల్లేని పరిస్థితి ఉండేది కాస్తా, లక్ష్మిపార్వతి ద్వారా డైరెక్ట్ గా ఎన్ టీ ఆర్ ని కలిసే స్థితికి చేరడంతో బాబులో కంగారు మొదలైంది.
వెన్ను పోటు తర్వాత ఎన్ టీ ఆర్ తీవ్రంగా కుంగి పోయాడు. ఆ వయసులో ఆయన ఆ దెబ్బను తట్టుకోలేక పోయాడు. ఆరోగ్యం దెబ్బ తిన్నది. అయినా సరే, నిజాలు జనానికి చెప్పాలని తపన పడ్డాడు. అప్పట్లో ఆయన ఒక ఆడియో కాసెట్ రిలీజ్ చేశాడు. “జామాతా దశమ గ్రహం” అనే పేరుతో అది విడుదల అయింది. 45 నిమిషాల నిడివి గల ఆ కాసెట్ లో ఆయన సంక్షోభానికి ముఖ్య మంత్రి బాబు, గవర్నర్ కృష్ణ్ కాంత్, స్పీకర్ యనమల రామకృష్ణుడు కారకులని ఆరోపించాడు
“మీ అన్నను మాట్లాడుతున్నా” అని ఎన్ టీ ఆర్ స్టైల్లో మొదలయ్యే ఆ కాసెట్టు “అనుకున్నది సాధిస్తే గాని నిద్ర పోని ఎన్ టీ ఆర్” అని ముగుస్తుంది. పాపం ఆయన తన ఆవేదన అంతా ఆ కాసెట్లో వెళ్లబుచ్చాడు. తన కుమారుడు హరి కృష్ణ తన మాట వినే వాడని, పదవి ఆశ జూపి బాబు అతన్ని తన నుంచి దూరం చేశాడని, గాంధీని చంపిన గాడ్సే కంటే కూడా బాబు ఘాతకుడ్దని ఆక్రోస పడ్డాడు. ప్రతి జిల్లాకూ ఆప్పట్లో ఆ కాసెట్లు పంపిణీ చేశారు
పలు విలేకరుల సమావేశాల్లో కూడా ఆయన బాబు పై ఆరోపణలు చేస్తూ నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడు. చంద్రబాబు చేస్తున్న తప్పుల్ని, శిశుపాలుడి తప్పులు కృష్ణుడు లెక్క పెట్టినట్టు లెక్కిస్తున్నానని కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు . తాను కృష్ణుడి వేషం పలు సినిమాలలో వేసి ఉండటం వల్ల,కృష్ణ పాండవీయంలో శిశుపాలుడి వంద తప్పులనూ లెక్కించి వధించిన కృష్ణుడి పాత్రని జ్ఞప్తికి తెచ్చుకుని, ఎప్పటికైనా చంద్రబాబు కి బుద్ధి చెపుతానన్న ఉద్దేశంతో ఈ మాట అని ఉండొచ్చు
తనకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదనీ, నల్లులు పట్టిన ఆ కుర్చీ కోసం సినిమాలు వదిలి రాజకీయాల్లోకి రాలేదని చెప్పాడు. “మామా, నాకు ముఖ్య మంత్రి పదవి కావాలి” అని అడిగితే తానే స్వయంగా ఇచ్చేవాడినని, వెన్ను పోటు పొడిచి లాక్కోవలసిన అవసరం రానిచ్చే వాడిని కాదని ఎన్ టీ ఆర్ పాపం తన ఆవేశాన్ని, ఆక్రోశాన్ని ఎన్నో సార్లు వెళ్ళగక్కినా, చివరికి ఆయన అనుకున్నది సాధించకుండానే లోకం వదిలి పోయాడు.
ఎన్ టీ ఆర్ కి ఇంతటి మానసిక క్షోభ కల్గించి పరోక్షంగా ఆయన చావుకి కారణమైన బాబు , ఆయన పోయాక మాత్రం ఆయన్ని దేవుడి పాత్ర ఇచ్చి పూజించడానికి కారణం, ఆయన ఫొటో లేనిది పార్టీకి ఓట్లు పడవని గ్రహించడమే
ఎన్ టీ ఆర్ ఫొటోకి పొద్దున్నే నమస్కరించి సంకల్పిస్తే అనుకున్న పని ఏదైనా నెరవేరుతుందని చంద్ర బాబు బూటకపు నాటకాలు వేయడం, కల్లబొల్లి కబుర్లు చెప్పడం గతాన్ని ప్రజలు మర్చిపోయి ఉంటారనే నమ్మకంతోనే.
గతంలో చేసిన పాపాలు వెంటాడవని, తను ఏం చేసినా చెల్లుతుందని బాబు అనుకోవడం ప్రజలు గమనిస్తూనే ఉంటారు. అందుకే బుద్ధి చెప్పారు. మళ్ళీ కూడా చెప్పడానికి సిద్ధంగానే ఉన్నారు. కాలం గడిచి పోయినా చరిత్ర మారదు, నిజాలు మారవు