ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ ఇంచార్జి బొల్లినేని రామారావుకు టీడీపీ-జనసేన ఉమ్మడి సీట్ల ప్రకటనలో చుక్కెదురైంది. బొల్లినేని రామారావునే ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందుగానే ప్రకటించినప్పటికీ, టీడీపీ జనసేన ప్రకటించిన తొలి జాబితాలో తన పేరు లేకపోవడం చూసి షాక్ కి గురయ్యాడు. సీట్ తనకు కేటాయించకపోవడంతో తన అనుచరులకు ఏమి చెప్పాలో తెలియక హైదరాబాద్ కి బొల్లినేని రామారావు వెళ్ళిపోయాడు.
తనకి సీటు కేటాయించకుండా కాకర్ల సురేష్ కు సీట్ ఇవ్వడం ఏంటని చంద్రబాబుపై బొల్లినేని రామారావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. యువగళం పాదయాత్రలో తనతో డబ్బును ఖర్చు చేయించి టికెట్ తనకే కేటాయిస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు వదిలేయడం పట్ల బొల్లినేని తీవ్ర ఆవేదన చెందుతున్నారని తెలుస్తుంది. పార్టీకి వ్యతిరేక పవానాలు వీస్తున్నపుడు పార్టీని అంటిపెట్టుకుని కార్యకర్తల బాగోగులు చూసుకున్న తనకు సీటును కేటాయించనని తెలిసినప్పుడు ఇన్ ఛార్జ్ బాధ్యతలు ఎందుకివ్వాలని, కనీసం టికెట్ ప్రకటించేముందు తన అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదని బొల్లినేని రామారావు బాధ పడుతున్నట్లు సమాచారం.
సీట్ల కేటాయింపు తర్వాత మొదటి రెండు రోజులు సైలెంట్ గా ఉన్న టీడీపీ అధిష్ఠానం, మూడో రోజు కాకర్ల సురేష్ కు సపోర్ట్ చేయమని బీద రవిచంద్రరావుని బొల్లినేని రామారావు వద్దకు మధ్యవర్తిగా పంపింది. కానీ టీడీపీ అధిష్టానంతో మాట్లాడేందుకు బొల్లినేని రామారావు ఇష్టపడలేదు . కనీసం చంద్రబాబుతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడాలని బీద రవిచంద్రరావు కోరగా అందుకు ససేమీరా అన్నట్లు తెలుస్తుంది. కాకర్ల సురేష్ ఓటమికి కట్టుబడి ఉంటానని ఇవాళో రేపో తన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి టీడీపీలో ఉండాలా లేదా వైఎస్సార్సీపీ లోకి వెళ్లాలా అని ఆలోచనలో సతమతమవుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా మరో రెండు మూడు రోజుల్లో తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.