విపత్తిపై నిర్లక్ష్యపు కత్తి.. అంటూ పత్తి రైతులకు అన్యాయం జరిగిపోయిందంటూ ఈనాడు కథనం ప్రచురించింది. పత్తి దిగుబడి తగ్గిందని, ధరలు పడిపోయాయంటూ అసత్య వార్తలను పచ్చ పత్రికలో అచ్చేసింది.
2018–19లో రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం 15లక్షల ఎకరాలు ఉండగా దిగుబడులు 14.91 లక్షల టన్నులు.. ఖరీఫ్ – 2023లో 10.35 లక్షల ఎకరాల్లో సాగుబడి జరిగి 12 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అంతర్జాతీయంగా పత్తి ధరలు తగ్గడం వల్ల పత్తి రైతులు మిరప, మొక్కజొన్న, ఆముదం, సోయాబీన్, జామ, డ్రాగన్ ఫ్రూట్, ఆయిల్ పామ్ వంటి పంటలకు మళ్లారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు, కోత దశలో మిచాంగ్ తుపాను ప్రభావం ఖరీఫ్–2023 సీజన్పై పడింది. పత్తి రైతులు ఇతర పంటలవైపు మళ్లడంతో వేరే పంటల సాగు బాగా పెరిగింది.
క్వింటా పత్తి ధర రూ.1000 కూడా పలకట్లేదంటూ ఈనాడు పచ్చ పత్రికలో ప్రచారం చేస్తోంది.. నిజానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు అన్ని సీజన్లలో ఎమ్మెస్పీకి మించి ధర పలికింది. గతేడాది రికార్డు స్థాయిలో రూ.13 వేలు పలికింది. అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ లేకపోయినప్పటికీ, రాష్ట్రంలో క్వింటా పొడుగు పత్తి గింజ ఎమ్మెస్పీ రూ.7020 కాగా, ఆదోని మార్కెట్లో రూ.7029 పలికింది. మధ్యస్థ గింజ ఎమ్మెస్పీ రూ.6,800 కాగా, రూ.6,620 పలికింది. మరొక వైపు ధరలు పతనమైన ప్రతిసారీ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ద్వారా పత్తిని కొంటోంది.
ఇలా నాలుగున్నరేళ్ళలో 83,413 మంది రైతుల నుంచి రూ.1,789 కోట్ల విలువైన 3.21 లక్షల టన్నుల పత్తి కొనుగోలు చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు ఆర్బీకేల ద్వారా సర్టిఫైడ్ పత్తి విత్తనాలను అందిస్తుంది. పత్తి పంటకు పడుతున్న గులాబీ రంగు పురుగును నాశనం చేసేందుకు అవసరమైన వనరులను 50 శాతం సబ్సిడీపై ఇచ్చింది. ఫలితంగా 2023–24 సీజన్లో ఈ పురుగు ఉధృతి గణనీయంగా తగ్గింది. నాణ్యమైన దిగుబడులు లక్ష్యంగా పొలంబడుల ద్వారా రైతులకు శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో విత్తు నుండి విక్రయం వరకు ప్రభుత్వ అధికారులు ఎల్లప్పుడూ రైతులకు తోడుంటున్నారు.
రైతులకు రైతు భరోసా, పంటల బీమా, ఉచిత విద్యుత్, ఇన్ పుట్ సబ్సీడీ అంటూ అనేక రకాలుగా తోడుండే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులను, పంటలను నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ రాయడం ఈనాడు కుటిల బుద్ధికి నిదర్శనం.